గుడ్ న్యూస్.. తెలంగాణ ఆసుపత్రుల్లో వసతులపై సీఎస్ కీలక ప్రకటన

by  |
cs-somesh-kumar 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : దసరా నుంచి ప్రతీ ప్రధాన ఆసుపత్రుల్లో పేషెంట్ల అటెండెంట్లకు షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఖాజాగూడలో కొవిడ్ మెగా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మెగా వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కరోనా వ్యాక్సిన్‌ను అందజేస్తామని వెల్లడించారు.

వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు నగరంలో మరో 6 మెగా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ప్రతీ రోజూ 3 నుంచి 4 లక్షల మందికి టీకాలు వేయనున్నట్లు వెల్లడించారు. మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక వ్యాక్సిన్ కౌంటర్లను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.80 కోట్ల మందికి టీకాలు వేశామని, ఇందులో 2.02 కోట్ల మందికి మొదటి డోస్ పూర్తి చేశామని తెలిపారు. ఈ నెలలో రాష్ట్రానికి దాదాపు కోటి టీకాలు సరఫరా అవుతాయని తెలిపారు.

ప్రతీ ఒక్కరికీ టీకా అందజేయడమే లక్ష్యమన్నారు. నగరానికి నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపడుతున్నామని, అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని నిమ్స్ ఆసుపత్రిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్. ఏ.ఎం. రిజ్వి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఓఎస్డీ గంగాధర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story