ఉద్యోగ పదోన్నతులు సీఎం ఓకే చేసినా సీఎస్ బ్రేక్.. కారణమేంటో..?

by  |
CM KCR, CS Somesh kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : “ దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించడం లేదనేది పాత సామెత… కానీ సీఎం ఆమోదించినా సీఎస్​ ఒప్పుకోవడం లేదు ” అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని సామెతగా మారింది. ఉద్యోగుల పదోన్నతుల అంశంలో సీఎం దగ్గర నుంచి ఫైల్​ వచ్చినా సీఎస్​.. ఆ తర్వాత విభాగాల నుంచి బయటకు రావడం లేదు. దీంతో పదోన్నతులు పొందిన ఉద్యోగులు పాత విధులను సరిగా చేయలేక… కొత్త పోస్టుల్లోకి వెళ్లలేక నలుగుతున్నారు. కొంతమంది ఏకంగా సెలవులకే పరిమితమవుతున్నారు. వచ్చినట్టే వచ్చిన పోస్టింగ్​లు ఊరిస్తూనే ఉన్నాయి. ఎదురుగా కోడిని పెట్టుకుని చికెన్​తో అన్నం తిన్నట్టుగా మారిందని అధికారులే చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటూ ఆయా శాఖల్లో చర్చించుకుంటున్నారు.

మాకు పోస్టింగ్​ ఆర్డర్లు ఇవ్వండి

రాష్ట్ర ఎక్సైజ్​తో పాటు వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూతో పాటు పలు విభాగాల్లో పోస్టింగ్​ల ఫైల్​కు ముందుకు కదలడం లేదు. ఉదాహరణగా ఎక్సైజ్​లో ఈ ఏడాది జనవరిలో డీపీసీ పూర్తి అయింది. మొత్తం 100 మందికిపైగా ఆబ్కారీ అధికారులకు ప్రమోషన్లు ఇచ్చారు. అనంతరం పోస్టింగ్​ల కోసం వెయిటింగ్​లో పెట్టారు. అటు వాణిజ్య పన్నుల శాఖలో కూడా దాదాపు 300 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. పదోన్నతులు వచ్చినా పోస్టింగ్​లు ఇవ్వకపోవడంతో ప్రమోషన్​ పొంది కూడా పాత కుర్చీలకే పరిమితమయ్యారు. ఇప్పుడు… అప్పుడూ అంటూ అధికారులను పోస్టింగ్​ల కోసం తిప్పుతున్నారు.

కాగా ఎక్సైజ్​ శాఖలో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ పట్టుబట్టి సదరు అధికారులకు పోస్టింగ్​లకు క్లియరెన్స్​ తెచ్చుకున్నారు. ఈ నెల 5న మొత్తం 41 మంది ఎక్సైజ్​ సూపరింటెండెంట్​లు, 20 మంది అసిస్టెంట్​ కమిషనర్లు, 15 మంది డిప్యూటీ కమిషనర్లు, ముగ్గురు జాయింట్​ కమిషనర్లు, ఇద్దరు అడిషనల్​ కమిషనర్లకు పోస్టింగ్​లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పోస్టింగ్​లపై గవర్నమెంట్​ ఆర్డర్లు ఉండాల్సి ఉండటంతో సీఎం నుంచి ఆమోదం వేయించుకున్నారు. దీనికి సంబంధించిన కాపీలు సదరు మంత్రికి కూడా చేరాయి. అక్కడి నుంచి సీఎస్​కు పంపించారు. ఇక సీఎస్​ నుంచి పోస్టింగ్​ ఆర్డర్లు రావడమే తరువాయి కావడంతో… ఒకటీ, రెండు రోజుల్లో ఆర్డర్​ కాపీలు వస్తాయని అధికారులు సంబురాలు చేసుకున్నారు. కానీ కారణాలేమిటో తెలియదు కానీ ఫైల్​ పెండింగ్​ పడిందని అబ్కారీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడో, అప్పుడో ఆర్డర్లు వస్తాయనుకుంటే ఫైల్​ కదలడం లేదని, సదరు మంత్రికి విన్నవించినా… సీఎస్​ దగ్గర పెండింగ్​ ఉంటుందని సమాధానం చెప్తున్నారని, ఇక ఇప్పుడు వస్తుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయని వాపోతున్నారు. ఎందుకు పోస్టింగ్​ ఆర్డర్లు ఇవ్వడం లేదనే సమాధానం చెప్పడం లేదంటున్నారు.

అదే విధంగా అటు వాణిజ్య పన్నుల శాఖలో కూడా అదే పరిస్థితి. కొంతమందికి పదోన్నతులు ఇచ్చినా పోస్టింగ్​ ఇవ్వడం లేదు. అంతేకాకుండా కొంతమందికి అసలు ప్రమోషన్లకే దూరం పెడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ మహిళా అధికారికి పదోన్నతి ఇవ్వడంలో సదరు శాఖ ఉన్నతాధికారి చాలా ఇబ్బందులు పెడుతున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రితో కూడా సదరు అధికారికి చెప్పించినా… పలు కారణాలను సాకుగా చూపిస్తూ మహిళా అధికారుల పదోన్నతుల ఫైల్​కు బ్రేక్​ వేస్తున్నారని ఆ శాఖలో చర్చించుకుంటున్నారు. దీనిపై సీఎం కేసీఆర్​కు లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కీలక సమయంలో కష్టాలు

పదోన్నతులు పొందిన అధికారులు ఎప్పుడు ఎక్కడ విధులు నిర్వర్తించాలనేది సందేహంగానే మారింది. పాత పోస్టుల్లో ఉండలేక… కొత్త పోస్టుల్లోకి వెళ్లలేక విధులు నిర్వర్తిస్తున్నారు. ఇచ్చినట్టే ఇచ్చిన పీఆర్సీ రావడం లేదనే అసంతృప్తితో ఉన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో ఇప్పుడు పోస్టింగ్​ ఆర్డర్లు ఇవ్వకుండా ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలున్నాయి. వెంటనే ఆర్డర్లు ఇప్పించాలంటూ మంత్రులను కోరుతున్నారు.


Next Story

Most Viewed