కోటి 40 లక్షల ఎకరాల సాగు అంచనా

by  |
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో కోటి 40 లక్షల ఎకరాల సాగు అంచనా వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. 70.05 లక్షల ఎకరాలలో పత్తి , 20 లక్షల ఎకరాలలో కంది, 41 లక్షల ఎకరాలలో వరి సాగవుతుందని అంచనా వేశారు. మంగళవారం వానాకాలం సాగు – విత్తన లభ్యతపై హాకా భవన్ లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు.

ఈ ఏడాది సాగుకు 13.06 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు అవసరమవుతుండగా రాష్ట్రంలో అవసరానికి మించి 18.287 లక్షల క్వింటాళ్ల విత్తనాలు నిల్వలు ఉన్నాయని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న కంది, పత్తి సాగును పెంచాలని రైతులకు పిలుపునిచ్చారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని పత్తి సాగుకు మొగ్గుచూపాలని సూచించారు. పత్తి సాగుకోసం 1.40 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతుండగా 59.32 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగిలిన విత్తన ప్యాకెట్లను క్లస్టర్ల వారీగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ లలో అకాల వర్షాల మూలంగా నాణ్యమైన సోయాబీన్ విత్తనం అందుబాటులో లేదని అందువల్ల సోయాబీన్ విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు డీలర్ల వద్ద సోయా విత్తనాలు కొనే రైతులు జాగ్రత్తలు చేపట్టి నాణ్యమైన విత్తనాన్ని మాత్రమే ఎంచుకోవాలని సూచించారు. వచ్చే యాసంగిలో వరికి ప్రత్యామ్నయంగా వేరుశనగ, నువ్వులు, ఆవాలు తదితర ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు. తక్కువ పెట్టుబడితో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలను పొందవచ్చిన చెప్పారు.

పప్పు దినుసుల పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంతర పంటలు వేసేందుకు ఉచితంగా ఎకరాకు రెండు కిలోల కంది విత్తనాలు అందిస్తామన్నారు. డీలర్ల వద్ద రైతులు కొన్న ప్రతి దానికి రశీదులు తీసుకోవాలని, లైసెన్స్ లేని వారి వద్ద విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనకూడదని సూచించారు. నకిలీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Next Story