ట్విస్టుల మీద ట్విస్టులు.. రిజిస్ట్రేషన్ అయినా టీఆర్ నెంబర్ ఇచ్చారెందుకో..?

by  |
ట్విస్టుల మీద ట్విస్టులు.. రిజిస్ట్రేషన్ అయినా టీఆర్ నెంబర్ ఇచ్చారెందుకో..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : వామన్ రావు దంపతుల హత్యకేసులో నిందితునిగా ఉన్న పుట్ట మధు మేనల్లుడు బిట్టు అలియాస్ తుల్సెగారి శ్రీనివాస్ పోలీసులు కావాలనే తప్పుదారి పట్టించాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వామన్ రావు దంపతులను పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద హత్య చేసేందుకు స్కెచ్ వేసుకున్న నిందితులు వాడిన కారు బిట్టు శ్రీనుదేనని పోలీసులు తేల్చారు. అయితే, బిట్టు శ్రీను కారు రిజిస్ట్రేషన్ అయినప్పటికీ టెంపరరీ నెంబర్ నే పోలీసులకు చూపించారు. ఆయన కారుకు టెంపరరీ రిజిస్ట్రేషన్ టీఎస్ 02 ఏపీ టీఆర్ 4995 కాగా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ టీఎస్ 22ఈ 1288గా ఆర్టీఏ రికార్డులో ఉంది. ఈ 24 ఫిబ్రవరి2020లో రిజిస్ట్రేషన్ అయినప్పటికీ పోలీసుల విచారణలో మాత్రం బిట్టు శ్రీను టెంపరరీ నెంబర్ మాత్రమే చెప్పడం గమనార్హం. పోలీసులు కూడా బిట్టు శ్రీను కారుకు టెంపరరీ నెంబర్ మాత్రమే ఉందని రిమాండ్ సీడీలో పేర్కొన్నారు. నిందితుని కన్ఫెషన్ ఆధారంగానే పోలీసులు రిమాండ్ సీడీలో వివరాలు పొందుపర్చారు. వాస్తవంగా హత్యకు ఏడాది ముందే ఈ కారుకు రెగ్యూలర్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చినా పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటో అంతుచిక్కకుండా పోయింది. అలాగే ఈ కారు తనదేనని బిట్టు శ్రీను పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. కానీ అతని భార్య తుల్సేగారి స్వరూప పేరు మీద ఉండటం గమనార్హం. నిందితుడు కావాలనే పోలీసులను తప్పుదోవ పట్టించాడా అన్న అనుమానం వ్యక్తం అవుతున్నాయి.

పంచాయతీలో అద్దె ట్రాక్టర్..

వామన్ రావు మర్డర్ కేసులో అరెస్టయిన బిట్టు శ్రీను కన్ఫెషన్ రిపోర్టుకు ఆయన వాడుతున్న కారుకు కూడ పొంతన లేకుండా ఉందనే చెప్పాలి. వామన్ రావు ఇచ్చిన ఫిర్యాదుతో తాను ఉపాధి కోల్పోయానని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. మంథని గ్రామపంచాయతీలో తన ట్రాక్టర్‌ను అద్దెకు పెట్టానని, దీని ద్వారా వచ్చే ఆదాయంతో ఉపాధి పొందేవాడినని కూడా బిట్టు శ్రీను చెప్పాడు. పంచాయతీలో ట్రాక్టర్ అద్దెకు పెడితే వచ్చే ఆదాయంతోనే ఉపాధి పొందిన బిట్టు శ్రీను రూ.15 లక్షల విలువ చేసే కారు కొనడం సాధ్యమేనా అన్నదే అంతుచిక్కడం లేదు. సాధారణంగా పంచాయతీల్లో ట్రాక్టర్ రెంట్‌కు పెడితే రూ.30 వేలకు వరకు వస్తుంది. అయితే, ఇందులో ట్రాక్టర్ మెయింటెనెన్స్, డిజిల్ ఖర్చులు పోగా అతని కుటుంబ పోషణకు సరిపోయే అన్ని డబ్బులు మాత్రమే మిగులతాయన్నది వాస్తవం. ఓ ట్రాక్టర్ అద్దెతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాని చెప్పిన బిట్టు శ్రీను విలువైన కారు తన భార్యపై ఎలా కొన్నాడో అంతు చిక్కడం లేదు. మరో వైపున బిట్టు శ్రీను సొంతగా ఇళ్లు కూడ నిర్మిస్తున్నాడని, మంథని సమీపంలోనే 5 ఎకరాల స్థలం కూడా ఉంది. మరోవైపున ఫిబ్రవరి 17న వామన్ రావు హత్య జరిగిన రోజున ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు వద్ద ఓ మిషన్ ప్రారంభానికి సంబంధించిన పూజలో పాల్గొన్నాడని కూడా చెప్తున్నారు. ఒక్క ట్రాక్టర్ అద్దెపైనే జీవనం సాగిస్తున్నానని చెప్పిన బిట్టు శ్రీను ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయన్నదే అసలు మిస్టరీ. వామన్ రావు బిట్టు శ్రీను ఉపాధిని లేకుండా చేయడం వల్లే హత్య చేయించినట్టు ఒప్పుకున్నాడని కన్ఫెషన్ రిపోర్టులో ఒప్పుకున్నాడు. కాస్ట్లీ కారు, పలు చోట్ల ఆస్థులు, సొంతిల్లు, మిషనరీ ఉన్న బిట్టు శ్రీను పోలీసులను కావాలనే తప్పుదోవ పట్టించారని స్పష్టం అవుతోంది. అయితే బిట్టు శ్రీను ఆ ఆస్థులు తనవి కావని బినామీగా ఉన్నానన్న ఉద్దేశ్యంతో పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చాడా లేక హత్యకు మూల కారణాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు పోలీసులను మిస్ గైడ్ చేశాడా అన్న విషయం తేలాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story