సింగిల్ ఇన్వెస్ట్, డబుల్ ప్రాఫిట్.. రియల్ వ్యాపారం మాటున ఘరానా మోసం

by Disha Web Desk |
సింగిల్ ఇన్వెస్ట్, డబుల్ ప్రాఫిట్.. రియల్ వ్యాపారం మాటున ఘరానా మోసం
X

దిశ,నల్లగొండ: వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. రంగురంగుల బ్రోచర్లు.. కాగితాలపై ఎకరాలకొద్దీ వెంచర్లు.. అవి చూసినా.. వారి మాటలు విన్నా.. వెంటనే ప్లాట్లను కొనుగోలు చేయాలన్పించడం ఖాయం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు విషయం తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. అక్కడ భూమి ఉండదు. అసలు అది రియల్ ఎస్టేట్ కంపెనీయే కాదు.. కానీ ఆ కంపెనీ పేరు మీద రూ.కోట్లలో లావాదేవీలు.. కార్పొరేట్ స్థాయిలో కార్యాలయం.. పదుల సంఖ్యలో ఏజెంట్లు.. సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి.. ఏడాదిలోనే డబుల్ ప్రాఫిట్ పట్టండి అంటూ ఆశ చూపడం వారి నైజం.. ఏజెంట్లకు 30 శాతం కమీషన్ ఎరగా చూపి రూ.కోట్లు నొక్కేసిన ఊదంతాన్ని నల్లగొండ ఎస్పీ అపూర్వరావు నేతృత్వంలో జిల్లా పోలీసు టీమ్ బట్టబయలు చేసింది. చేతిలో చిల్లి గవ్వ లేకుండానే 144 మందిని మోసగించి రూ.4.50కోట్లు స్వాహా చేసిన రియల్ మాయగాళ్ల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన జిల్లా పోలీసు టీమ్‌ శభాష్ అనిపించుకుంది.

అసలేం జరిగిందంటే ..

హైదరాబాద్‌లోని ఓంకార్ నగర్‌కు చెందిన మామిళ్ల గిరిప్రసాద్ (34), బైరామల్‌గూడ పిండి నారాయణరెడ్డి కాలనీకి చెందిన బొడ్డు వెంకటేశ్ (23) స్నేహితులు. వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. అయితే ప్లాట్ల క్రయవిక్రయాలు చేయడం ద్వారా వచ్చే ఆదాయం జల్సాలు చేసేందుకు సరిపోకపోవడంతో కొత్త దందాకు తెరలేపారు. అప్పటికే వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాస్తో కూస్తో అనుభవం ఉండడం వల్ల ఇతరులు చేసిన వెంచర్లలో ప్లాట్లు అమ్మిస్తామని చెప్పి.. యాజమానుల దగ్గరి నుంచి సదరు లేఔట్‌ కాపీలను తీసుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం బైరమాల్‌గూడలో గోల్డెన్ ఈగల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ పేరుతో బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ పేరు మీద బ్రోచర్లు తయారు చేయించి సువర్ణావకాశం అంటూ కొత్త స్కీమ్‌కు ప్లాన్ చేశారు. ‘రూ.10 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనండి.. ఏడాది తర్వాత ప్లాట్ తిరిగిచ్చి రూ.20 లక్షలు తీసుకెళ్లండి..’ అంటూ పెద్దఎత్తున ప్రచారం చేశారు. అప్పటికే కొంతమంది అమాయక కస్టమర్లను బురిడీ కొట్టించి సొమ్ము చేసుకున్నారు.

కంపెనీ పేరు.. మకాం మార్చి

కొన్నాళ్లకు అదే పేరుతో అప్పటికే రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందనే విషయం తెలుసుకుని.. సదరు మాయగాళ్లు ఓంకార్ నగర్‌కు మకాం మార్చారు. అక్కడు ఐదు దుకాణాలను అద్దెకు తీసుకుని కార్పొరేట్ కార్యాలయం తరహాలో ‘గౌతమ్స్ ఈగల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో ఆఫీసు ఓపెన్ చేశారు. అయితే ఈ కార్యాలయంలో నమ్మకంగా పనిచేసేందుకు నానక్‌నగర్‌కు చెందిన బర్ల శేఖర్‌ను ఉద్యోగిగా నియమించుకున్నారు. అయితే ప్రతి కస్టమర్ నుంచి వచ్చే డబ్బులో 0.8 శాతం శేఖర్‌కు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆఫీసు వ్యవహారాలన్నింటినీ బర్ల శేఖర్, బొడ్డు వెంకటేశ్ చక్కబెట్టేవారు.

రూ.లక్ష పెడితే.. ఏడాదిలోనే డబుల్ అమౌంట్

వ్యాపారం స్లోగా ఉందనుకున్నారో.. ఏమోగానీ ఆ రియల్ మాయగాళ్లు.. ‘గౌతమ్స్ ఈగల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో పాంప్లేట్స్, బ్రోచర్లు, బుక్‌లెట్స్, నోట్ బుక్స్ ప్రింట్ చేయించి.. పెద్దఎత్తున మార్కెటింగ్ చేశారు. ‘రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు మా వెంచర్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఏడాదిలోనే డబుల్ అమౌంట్ తీసుకెళ్లండి’ అంటూ మార్కెట్‌లో మారుమోగించారు. దీన్ని నమ్మించేందుకు వీలుగా ముందుగానే ప్లాట్ అగ్రిమెంట్ కాగితాలతో పాటు పోస్ట్ డెటెడ్ చెక్కులు ఇచ్చి కస్టమర్లను బురిడీ కొట్టించారు. దీనికితోడు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో ఓంకార్ నగర్‌కు చెందిన మామిళ్ల గిరిప్రసాద్ పేరుతో పాటు సదరు కంపెనీ పేరుపై భూమి ఉన్నట్టు, వెంచర్ లేఔట్ కాపీలను చైతన్యపురిలో తయారు చేయించి అందరినీ బోల్తా కొట్టించారు.

30 శాతం కమీషన్ పేరుతో ఎర ..

మామిళ్ల గిరిప్రసాద్, బొడ్డు వెంకటేష్ కలిసి తమకు అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయం ఉన్న బట్టపల్లి గ్రామానికి చెందిన మాదగోని వెంకటేశ్ గౌడ్‌ను కలిశారు. మా ‘గౌతమ్స్ ఈగల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్’ కంపెనీలో ఎవరైనా తెలిసిన వారు ఉంటే పెట్టుబడి పెట్టించండి.. అందుకు ప్రతిఫలంగా 30 శాతం కమీషన్ ఇస్తామని ఆశ చూపారు. అలా మాదగోని వెంకటేశ్‌గౌడ్‌ను వారి వద్దే ఏజెంటుగా నియమించుకున్నారు. ఇతడితో పాటు బర్ల శేఖర్ సైతం తనకు తెలిసిన వారితో బోగస్ కంపెనీలో పెట్టుబడి పెట్టించి.. 30 శాతం కమీషన్ తీసుకోవడం గమనార్హం. ఇది చాలదన్నట్టు కస్టమర్లను తీసుకొచ్చిన వారికి 30 శాతం ఇస్తామని చెప్పడంతో మాదగోని వెంకటేశ్‌గౌడ్ తన కింద కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకున్నారు. అలా 30 శాతం కమీషన్ కోసం కక్కుర్తి పడి వెంకటేశ్ గౌడ్ కస్టమర్లను పెద్దఎత్తున మోసం చేసి ప్లాట్లను కొనుగోలు చేయించారు. వీరితో పాటు మర్రిగూడకు చెందిన సుధాకర్, చెరుకు శ్రీరాములు, బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన పచ్చిపాల గణేశ్, సురిగి రమేశ్‌లు సైతం 30 శాతం కమీషన్ కోసం కస్టమర్లను తీసుకొచ్చి మోసగించారు.

నమ్మించేందుకు బాండ్ పేపర్లు .. పోస్ట్ డెటెడ్ చెక్కులు ..

తమ కంపెనీలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన కస్టమర్లకు ఏలాంటి అనుమానం రాకుండా మామిళ్ల గిరిప్రసాద్, బొడ్డు వెంకటేశ్‌లు గిరి ప్రసాద్ కంపెనీ పేరు మీద ఇన్వెస్టర్ల అందరిని పిలిచి పార్టీ పెట్టి మా కంపెనీ మంచి లాభాలు ఇస్తుంది అని చెప్పి కొంత మంది తమకు కావాల్సిన వాళ్ళకి డబ్బులు పంచినట్లు నమ్మించి బాండ్ పేపర్లు రాసివ్వడంతో పాటు ప్రామిసరీ నోట్లు, పోస్ట్ డెటెడ్ చెక్కులపై సంతకాలు పెట్టి ఇచ్చేవారు. ఇదిలావుంటే.. అలావచ్చిన డబ్బులో 30 శాతం ఏజెంట్ కమీషన్ పోగా, మిగిలిన దాంట్లో 40 శాతం జల్సాలు, సినిమా షూటింగ్‌లకు మామిళ్ల గిరిప్రసాద్, బోడ్డు వెంకటేశ్‌లు ఖర్చు చేసేవారు. మరో 30 శాతం డబ్బును మాత్రం ఎవరైనా కస్టమర్లు వచ్చి మా డబ్బు వెనక్కి ఇవ్వాలని గొడవ చేస్తే.. ఇచ్చేందుకు వీలుగా ఆఫీసులోనే దాచిపెట్టడం కొసమెరుపు. ఇప్పటివరకు ఈ మాయగాళ్లు 144 మందిని మోసం చేసి రూ.4.50 కోట్లు స్వాహా చేశారు. ఇదిలావుంటే.. ఆగస్టు 6న అన్నపూర్ణ స్టూడియోలో ‘గౌతమ్స్ ఈగల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్’ ప్రొడక్షన్ నంబర్ 1 పేరు మీద సినిమా షూటింగ్ ప్రారంభించడం హైలెట్ అని చెప్పాలి. ఈ షూటింగ్‌కు సైతం అమాయక కస్టమర్లను మోసగించిన డబ్బుగానే పోలీసులు తేల్చారు. ఒకవేళ బాధితులంతా వచ్చి డబ్బులు ఇవ్వాలని బలవంతం చేస్తే ఐపీ పెట్టి పరారయ్యేందుకు సదరు నిందితులు మామిళ్ల గిరిప్రసాద్, బొడ్డు వెంకటేశ్‌లు స్కెచ్ వేశారని నల్లగొండ జిల్లా పోలీసు టీమ్ గుర్తించింది.

అక్రమాలకు పాల్పడితే ఎవ్వరినీ వదలిపెట్టబోము ..

అక్రమాలకు పాల్పడితే ఎవ్వరినీ విడిచిపెట్టబోము. సువర్ణావకాశమంటూ అమాయక ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా తమ దృష్టికి తీసుకురావాలి. రియల్ మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

- కె.అపూర్వరావు, నల్లగొండ ఎస్పీ



Next Story

Most Viewed