BREAKING: పేగుబంధం.. ప్రేమబంధం! తల్లి మృతిని జీర్ణించుకోలేక కొడుకు హఠాన్మరణం

by Disha Web Desk 1 |
BREAKING: పేగుబంధం.. ప్రేమబంధం! తల్లి మృతిని జీర్ణించుకోలేక కొడుకు హఠాన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్/ కౌడిపల్లి: గుండెపోటుతో తల్లి కొడుకులు మృతిచెందిన హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొంత లలిత(72) శనివారం రాత్రి గుండెపోటుకు గురైంది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే, ఆమె అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. అనంతరం అంత్యక్రియలు ఆదివారం కౌడిపల్లి‌లో జరిగాయి. ఈ క్రమంలో కుమారుడు దొంత నరేందర్(45) తల్లి మరణం తట్టుకోలేక ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో ఇంట్లో మృతి చెందాడు. నర్సాపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి సోమవారం నరేందర్ మృతదేహాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.

తల్లి అంత్యక్రియలు జరిగిన రాత్రి కుమారుడు గుండెపోటుకు గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని ఇద్దరు అన్నలు గతంలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందగా, మరొకరు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తండ్రి మతిస్థిమితం లేక కొన్ని సంవత్సరాలు క్రితమే మరణించాడు. నరేందర్‌కు భార్య లక్ష్మి, కుమారుడు, కూతురు, ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు ఉన్నారు. అంతిమయాత్రలో టీపీఆర్టీ‌యూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఓం ప్రకాష్, మండల విశ్రాంత ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పుండరీకం గౌడ్, మాజీ ఎంపీపీ రుద్రప్ప, మాజీ సర్పంచ్ శివాంజనేయులు గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story