A1 గా బంజారాహిల్స్ సీఐ నరేందర్.. విచారణ సమయంలో అస్వస్థత

by Disha Web Desk 2 |
A1 గా బంజారాహిల్స్ సీఐ నరేందర్.. విచారణ సమయంలో అస్వస్థత
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లంచాల బాగోతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్కై లాంజ్ పబ్ అనుమతుల కోసం దాని యజమాని నుంచి లంచం డిమాండ్ చేసిన బంజారాహిల్స్ సీఐ నరేందర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1 గా సీఐ నరేందర్, ఏ2గా ఎస్ఐ నవీన్ రెడ్డి, ఏ3 గా హోంగార్డు హరి పేర్లను చేర్చింది. స్కై లాంజ్ పబ్ నుంచి మొదట 4.5 లక్షలు బంజారాహిల్స్ సీఐ నరేందర్ డిమాండ్ చేశాడని స్కై లాంజ్ పబ్ ఓనర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

చివరిగా సీఐ నరేందర్‌తో 3 లక్షల రూపాయలను డీల్ కుదుర్చుకున్నట్లు పబ్ ఓనర్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ.. ఇవాళ ఉదయం నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తో పాటు నరేందర్ నివాసంలో తనిఖీలు చేపట్టింది. డబ్బులు ఇవ్వాలని వాట్సాప్ కాల్ తో పబ్ ఓనర్ ని వేధించారని ఏసీబీ పేర్కొంది. హోంగార్డు హరి రూ.10 వేలు వ్యక్తిగతంగా డిమాండ్ చేసినట్లు ఏసీబీ చెప్పింది. విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు సంచుల్లో డబ్బులను తీసుకురావడంతో ఈ కేసులో సంచలనంగా మారింది.

ఇన్ స్పెక్టర్ నరేందర్ కు అస్వస్థత

విచారణ సమయంలో సీఐ నరేందర్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి అంటూ ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో అతడిని వెంటనే ఏసీపీ అధికారులు ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed