జోగిపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

by Disha Web Desk 1 |
జోగిపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
X

డీఎస్పీ రవీందర్ రెడ్డి విచారణ

దిశ, ఆందోల్: తనపై దాడి చేసిన వారిని పట్టించుకోలేదంటూ.. ఓ యువకుడు ఆదివారం రాత్రి జోగిపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జోగిపేటలో రిక్షా కాలనీలో నివాసం ఉంటున్న ఖలీల్‌ (40) బసవేశ్వర విగ్రహం వద్ద తనపై దాడి చేసి ఫోన్‌ పగలగొట్టారని 100 డయల్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చాడు.

వెంటనే ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేసిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఖలీల్‌ తప్ప మిగతా ఎవరూ లేకపోవడంతో గొడవ జరిగిన విషయాన్ని ఆ ప్రాంతానికి చెందిన వారిని ప్రశ్నించారు. గొడవ జరిగిన విషయం వాస్తవమే కానీ.. వారెవరో తమకు తెలియదన్నారు. పోలీసులు స్టేషన్‌కు ఖలీల్‌ను తీసుకువచ్చి సర్ది చెప్పి ఉదయం పిలిపిస్తామని చెప్పి పంపించారు.

కొద్దిసేపటికే ఖలీల్‌ స్టేషన్‌ ఎదుట తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని స్టేషన్‌లోకి పరుగులు తీశాడు. స్టేషన్‌లోనే ఉన్న సీఐ నాగరాజు, ఎస్‌ఐ సామ్యానాయక్‌ బయటకు వచ్చి సిబ్బందితో ఒంటిపై ఉన్న మంటలను ఆర్పివేయించారు. వెంటనే ఖలీల్ ను ఆటోలో జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

విచారణ చేపట్టిన డీఎస్పీ..

జోగుపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారనే విషయం తెలుసుకున్న సంగారెడ్డి డీఎస్పీ రవీందర్ రెడ్డి జోగిపేట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా.. ఖలీల్ వినకుండా, తాగిన మైకంలో ఖలీల్ తన ఒంటిపై పెట్రల్ పోసుకుని నిప్పింటించుకున్నాడని ఆయన తెలిపారు. ప్రస్తుతం అతడిని మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.


Next Story

Most Viewed