రైతులకు సంకెళ్లపై స్పందించిన రాచకొండ పోలీసులు

by Dishafeatures2 |
రైతులకు సంకెళ్లపై స్పందించిన రాచకొండ పోలీసులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తటంతో రాచకొండ పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రైతులను న్యాయస్థానానికి తీసుకెళ్లినపుడు బందోబస్తు ఇంఛార్జీగా ఉన్న ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్​అలైన్​మెంట్​ను మార్చాలని రైతులు గతనెల 29, 3‌‌0వ తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​ఆవరణలో నిరాహార దీక్షలు జరిపిన విషయం తెలిసిందే. మే 30న రాష్ర్ట ఆవిర్భావ వేడుకలపై సమీక్ష నిర్వహించిన మంత్రి బయటకు వస్తుండగా గేటు వద్ద ఆయనను అడ్డుకోవటానికి రైతులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఆరుగురు రైతులను అరెస్టు చేశారు. వారిపై వేర్వేరు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. కాగా, అరెస్టయిన వారిలో జీ.నారాయణరెడ్డి, టీ.రవికుమార్​కు బెయిల్ మంజూరు కావటంతో అదే రోజు విడుదలయ్యారు. మిగిలిన నలుగురు రైతులను పోలీసులు రిమాండ్​కు తరలించారు. వీరిని మొదట భువనగిరి జైలుకు తరలించిన పోలీసులు ఆ తరువాత నల్గొండ జిల్లా జైలుకు మార్చారు. మంగళవారం ఈ నలుగురిని భువనగిరి సీనియర్​సివిల్​జడ్జి కోర్టుకు తీసుకు వచ్చినపుడు పోలీసులు వారి చేతులకు బేడీలు వేశారు. దీనిపై అన్నివర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

రాచకొండ పోలీసుల వివరణ

దీనిపై రాచకొండ పోలీసులు వివరణ ఇస్తూ ఆయా కేసుల్లో పట్టుబడిన వారి ప్రవర్తనను బట్టి ఎంతమంది బందోబస్తుతో తీసుకెళ్లాలో నిర్ణయిస్తామని చెప్పారు. ఈ నలుగురిని అరెస్టు చేసిన సమయంలో పోలీసులను తోసివేయటంతోపాటు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారన్నారు. కలెక్టర్​ఆఫీస్​లోపలికి వెళ్లి నిప్పు కూడా పెట్టినట్టు చెప్పారు. ఇక, అరెస్టయిన వారిలో ఏ ఒక్కరూ రైతు కారని తెలిపారు. ఈ నలుగురిలో ఓ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తికి 20 గుంటల భూమి ఉన్నట్టు చెప్పారు. దీంట్లో కొంత భూమి ఆర్ఆర్ఆర్​నిర్మాణంలో పోతున్నదని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. అరెస్టు చేసిన నలుగురిని కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో ప్రొటోకాల్​ను అనుసరించే సంకెళ్లు వేసినట్టు తెలిపారు. కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో కూడా ఈ నలుగురు ఎస్కార్టు సిబ్బందిని ఇబ్బంది పెట్టినట్టు చెప్పారు. సంకెళ్లు వేయటంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో బందోబస్తులో ఉన్న అధికారిపై క్రమ శిక్షణా చర్య తీసుకుంటున్నట్టు తెలియచేశారు.



Next Story

Most Viewed