దేశాన్ని అస్థిరపరచాలన్నది వారి కుట్ర.. కోర్టుకు ఇచ్చిన ఛార్జీషీట్​లో వివరించిన ఎన్​ఐఏ

by Dishafeatures2 |
దేశాన్ని అస్థిరపరచాలన్నది వారి కుట్ర.. కోర్టుకు ఇచ్చిన ఛార్జీషీట్​లో వివరించిన ఎన్​ఐఏ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: అంతర్గత అలజడులు సృష్టించటం ద్వారా దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్న పీపుల్స్​ఫ్రంట్​ఆఫ్​ఇండియా దక్షిణాదిలో నెట్​వర్క్​ను పెంచుకునే కుట్రను అమలు చేస్తోంది. ఆ తరువాత ఉత్తరాదిపై దృష్టి పెట్టాలని పథకాలు రూపొందించుకుంది. పీపుల్స్​ఫ్రంట్​అగ్రనేతల్లో ఒకరు అరెస్టయిన తరువాత అప్రూవర్ గా మారి స్వయంగా ఈ విషయాలను మెజిస్ర్టేట్​ఎదుట వెల్లడించారు. కొంతకాలం క్రితం పీపుల్స్​ఫ్రంట్​కు చెందిన 19మంది కీలక సభ్యులను ఎన్​ఐఏ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి సంబంధించి ఎన్​ఐఏ అధికారులు ఢిల్లీ కోర్టులో ఛార్జీషీట్​దాఖలు చేస్తూ అందులో పలు కీలక విషయాలను వివరించారు.

2047 సంవత్సరంలోపు భారత్​లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో పని చేస్తున్న పీపుల్స్​ఫ్రంట్​ఆఫ్​ఇండియా మతం పేరుతో వందల సంఖ్యలో యువకులను ఉగ్రబాటలోకి నడిపిస్తోందని ఎన్​ఐఏ అధికారులు ఛార్జీషీట్లో పేర్కొన్నారు. సామాజిక రాజకీయ ఉద్యమం ముసుగులో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోందని తెలిపారు. అరెస్టు చేసిన 19మందిలో పన్నెండుమంది పీపుల్స్​ఫ్రంట్​ఆఫ్​ఇండియా నేషనల్​ఎగ్జిక్యూటీవ్​సభ్యులని పేర్కొన్నారు.

యువకులను ఉగ్రబాటలోకి..

లక్ష్యాన్ని సాధించేందుకుగాను పీపుల్స్​ఫ్రంట్​ఆఫ్​ఇండియా చాపకింది నీరులా తన కార్యకలాపాలను విస్తరిస్తోందని వివరించారు. గతంలో జరిగిన మతఘర్షణల వీడియోల క్లిప్పింగులు..వార్తల కటింగులు చూపించి మతం పేర రెచ్చగొడుతూ ఉగ్రవాదం బాటలోకి నడిపిస్తోందని తెలియచేశారు. ఇలా వచ్చిన వారిలో చురుకుగా...శారీరకంగా ధృఢంగా ఉన్నవారితో స్ర్టయికింగ్​టీములను ఏర్పాటు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. మిగిలిన వారిలో ఎంపిక చేసిన వారితో సపోర్ట్​టీములను ఏర్పాటు చేస్తున్నారన్నారు. సపోర్టు టీములు టార్గెట్​గా చేసిన వారికి సంబంధించి రెక్కీ జరిపి వివరాలను స్ర్టయికింగ్​టీములకు అందిస్తాయని తెలియచేశారు. దాంతోపాటు ఆయుధాలు కూడా సమకూరుస్తారని పేర్కొన్నారు.

ఆ తరువాత స్ర్టయికింగ్​టీముల సభ్యులు రంగంలోకి దిగి కుట్రలను అమలు చేస్తారని వివరించారు. ఇలా అలజడులు సృష్టించటం ద్వారా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచాలన్నది వారి కుట్ర అని తెలియచేశారు. కొంతకాలం క్రితం తర్భియాత్​సెషన్స్​నిర్వహించిన పీపుల్స్​ఫ్రంట్​ఆఫ్​ఇండియా పాకిస్తాన్​అంతర్గత అలజడులు పెరిగినపుడు భారత సైన్యం దృష్టి మొత్తం దానిపైనే ఉంటుందని, అదే అవకాశంగా ఉత్తర భారతదేశంలో నెట్​వర్క్​ను విస్తరించాలని నిర్ణయించినట్టుగా అప్రూవర్​గా మారిన పీపుల్స్​ఫ్రంట్​ఆఫ్​ఇండియా సభ్యుడు విచారణలో వెల్లడించినట్టు ఛార్జీషీట్​లో వివరించారు. ఇప్పటికే పీపుల్స్​ఫ్రంట్​ఆఫ్​ఇండియా వందల సంఖ్యలో యువకులను రిక్రూట్​చేసుకుని ఆత్మరక్షణ పేరుతో వారికి సాయుధ శిక్షణ ఇచ్చినట్టుగా తెలిపారు.

పీపుల్స్​ప్రంట్​ ఆఫ్ ​ఇండియా ఎప్పుడు చెబితే అప్పుడు వీళ్లు రంగంలోకి దిగి అలజడులు సృష్టించటానికి తయారుగా ఉన్నట్టు వివరించారు. పీపుల్స్​ఫ్రంట్​ఆఫ్​ఇండియా సిద్ధాంతాలను వ్యతిరేకించే వారితోపాటు వేర్వేరు రాజకీయ పార్టీల నాయకులను టార్గెట్​చేయాలన్నదే వారి లక్ష్యమని తెలిపారు. దీనికోసం సపోర్ట్​టీములు, స్ర్టయికింగ్​టీములను రంగంలోకి దింపి లక్ష్యంగా చేసుకున్న వారిని హత్యలు చేయాలన్నది పీపుల్స్​ఫ్రంట్​ఆఫ్​ఇండియా కుట్ర అని పేర్కొన్నారు. తద్వారా మతఘర్షణలను సృష్టించి ప్రభుత్వాలను అస్థిరపరచాలన్నది దాని ఉద్దేశ్యమని వివరించారు.


Next Story