ఘోరం.. కన్న కూతురుపై తండ్రి అత్యాచారం..

by Disha Web Desk 11 |
ఘోరం.. కన్న కూతురుపై తండ్రి అత్యాచారం..
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: బాలికపై కన్న తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి భూత్పూర్ ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వీరిలో రెండవ కూతురు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ విద్యా సంస్థలో ఏడో తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా ఇంటి వద్ద ఉంటుంది. బుధవారం తనకు కడుపులో నొప్పిగా ఉంది అంటూ ఇబ్బంది పడుతూ తన కూతురు పడుకుని ఉండడంతో ఏమైందని అడిగితే జరిగిన సంఘటనను గురించి తన తల్లి, అక్కకు ఆ బాలిక వివరించింది.

గత డిసెంబర్ నెలలో క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చినప్పుడు మాయమాటలు చెప్పి తండ్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక పేర్కొంది. ఇంటికి వచ్చిన పలు సందర్భాలలోనూ పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా పాఠశాలలో వేధింపులు, తదితర అంశాలకు సంబంధించి గుడ్ టచింగ్-బ్యాడ్ టచింగ్ అనే అంశాలను గురించి వివరించడంతో.. తన తండ్రి తనతో వ్యవహరించిన తీరును ఆ బాలిక తన అక్కకు ఫోన్ ద్వారా తెలిపింది. తండ్రి గతంలోనూ ఆమెపై కూడా అత్యాచారయత్నం జరపడంతో ఆమె అతడి భారీ నుండి తప్పించుకుంది. విషయం బయట పడితే తమ పరువు పోతుందన్న భయంతో పెద్ద కూతురు విషయాన్ని ఎవరికి చెప్పలేదు.

పది రోజుల క్రితం తండ్రి మరోసారి రెండవ కూతురుపై అత్యాచారానికి పాల్పడడంతో.. బాలిక తరచుగా అనారోగ్యానికి గురవుతూ వచ్చింది.. ఈ క్రమంలో కడుపునొస్తుంది అంటూ ఏడుస్తుండగా తల్లి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంది. పెద్ద కూతురు కూడా సంఘటనకు సంబంధించిన వివరాలను, చెల్లెలు గతంలో తనకు చెప్పిన అంశాలను తల్లికి తెలియజేసింది. జరిగిన విషయంపై బాలికల తల్లి తండ్రిని నిలదీయడంతో కూతుళ్లు ఎవరి వంక చూడకూడదని ఉద్దేశంతో తాను ఇలా చేశానని చెప్పడంతో ఆగ్రహించిన మహిళ, తన కూతుళ్లను తీసుకొని వచ్చి భూత్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై భాస్కర్ రెడ్డి అత్యాచారానికి గురైన బాలికను వైద్య సేవల కోసం ఆసుపత్రికి పంపించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed