జలంధర్, అమృత్‌సర్‌లో వరుస పేలుళ్లు.. అప్రమత్తమైన భద్రతా దళాలు

by Kema Shiva Kumar |

పంజాబ్‌లో జంట పేలుళ్లు కలకలం సృష్టించాయి. జలంధర్‌లోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం, అమృత్‌సర్‌లోని ఆర్మీ క్యాంప్ సమీపంలో పేలుళ్లు సంభవించాయి.

జలంధర్, అమృత్‌సర్‌లో వరుస పేలుళ్లు.. అప్రమత్తమైన భద్రతా దళాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరస పేలుళ్లు పంజాబ్ (Punjab) రాష్ట్రాన్ని వణికించాయి. జలంధర్‌లోని బీఎస్ఎఫ్ (BSF) ప్రధాన కార్యాలయం, అమృత్‌సర్‌లోని ఆర్మీ క్యాంప్ సమీపంలో ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్వల్ప వ్యవధిలోనే ఈ రెండు పేలుళ్లు జరిగాయి. జలంధర్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ప్రధాన కార్యాలయం వెలుపల మొదటి పేలుడు సంభవించింది. అనంతరం కొద్దిసేపటికే అమృత్‌సర్‌లోని ఆర్మీ క్యాంప్ పరిసర ప్రాంతంలో రెండో పేలుడు చోటుచేసుకుంది.

ఈక్రమంలోనే అత్యంత సున్నితమైన ఈ ప్రాంతాల్లో పేలుళ్లు జరగడంతో భారత భద్రతా దళాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనల్లో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జంట పేలుళ్ల వెనుక ఉన్న శక్తులు ఎవరనే దానిపై కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఘటన జరిగిన వెంటనే పంజాబ్ అంతటా హై అలర్ట్ ప్రకటించి సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. పేలుళ్లు జరిగిన ప్రదేశాలను బట్టి చూస్తే, దేశ భద్రతా దళాలనే లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బ్లాస్ట్‌ల వెనుక ఉగ్ర కోణం ఉందా లేదా అనే అంశంపై ఎన్‌ఐఏ (NIA) అధికారులు ఆరా తీస్తున్నారు.

Next Story