కుమార్ ప్రజాపతిపై 600కు పైగా కేసులు

by Dishafeatures2 |
cyber crime
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: 712 కోట్ల రూపాయల సైబర్ మోసం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితునిగా ఉన్న కుమార్ ప్రజాపతిపై దేశ వ్యాప్తంగా 6 వందలకు పైగా ఎఫ్ఐఆర్ లు నమోదై ఉన్నట్టు విచారణలో వెళ్లడయినట్టు సమాచారం. రెండేళ్ల క్రితం హైదరాబాద్ సైబర్ పోలీసులకు చిక్కినట్టే చిక్కి కుమార్ ప్రజాపతి తప్పించుకున్నట్టు తెలిసింది. ఇక, పెట్టుబడుల పేర జనం నుంచి కొట్టేసిన కొట్లాది రూపాయలను చైనాకు తరలించటంలో ఆ దేశానికి చెందిన సాషా అనే మహిళ కుమార్ ప్రజాపతికి సహకరించినట్టు సమాచారం. ఈ క్రమంలో కుమార్ ప్రజాపతిని కస్టడీకి తీసుకొని మరింత క్షుణ్ణంగా విచారించాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. చిక్కడపల్లి నివాసి శివకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు ఇటీవల 9 మంది నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

రాధికా మార్కెటింగ్ పేరుతో 33 షెల్ కంపెనీలు తెరిచిన నిందితులు వేర్వేరు బ్యాంకుల్లో 61కి పైగా ఖాతాలు తెరిచారు. పెట్టుబడుల పేర దేశ వ్యాప్తంగా 15 వేల మందిని ఉచ్చులోకి లాగిన ముఠా మొత్తం 712 కొట్లు కొల్లగొట్టింది. ఈ డబ్బును దుబాయ్ లో ఉంటున్న సహచరులకు పంపించి క్రిప్టో కరెన్సీగా మార్పించింది. ఆ తర్వాత ఈ క్రిప్టో కరెన్సీని చైనా దేశానికి చేర్చింది. ఈ కేసులో మాస్టర్ మైండ్ చైనా దేశస్తులని వెల్లడి కాగా మొత్తం వ్యవహారంలో అహమదాబాద్ కు చెందిన కుమార్ ప్రజాపతి కీలక పాత్ర పోషించినట్టు స్పష్టం అయ్యింది. ఈ క్రమంలో మరింత లోతుగా విచారణ జరుపగా కుమార్ ప్రజాపతిపై దేశం మొత్తం మీద వేర్వేరు పోలీస్ స్టేషన్లలో 6 వందలకు పైగా కేసులు నమోదై ఉన్నట్టుగా వెళ్లడయినట్టు తెలిసింది.

నిజానికి..

పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం 2021లోనే కుమార్ ప్రజాపతి అరెస్ట్ కావాల్సి ఉంది. ఓ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ పోలీసులు అప్పట్లో 41సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం కుమార్ ప్రజాపతికి నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. అయితే, తనకు కరోనా సోకిందని ఓ హాస్పిటల్ లో చేరి ఆ తర్వాత కుమార్ ప్రజాపతి పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నట్టు సమాచారం.


Next Story