డీఎస్పీ పేరుతో స్కామ్.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని గిరిజన మహిళ నుంచి రూ. 72లక్షల దోపిడి..

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-17 13:17:26  IST  )

* ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం * గిరిజన మహిళ నుంచి ఏకంగా రూ. 72లక్షలు దోపిడీ * డీఎస్పీ పేరుతో మోసానికి పాల్పడిన వైనం.. చివరకు..

డీఎస్పీ పేరుతో స్కామ్.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని గిరిజన మహిళ నుంచి రూ. 72లక్షల దోపిడి..
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్ బలరాంపూర్ జిల్లా కంజియా గ్రామానికి చెందిన ఆదివాస మహిళ లాల్కీ బాయి గొర్రెలు మేపి కుటుంబాన్ని పోషిస్తుంది. తన లాగా తన ఇద్దరు కొడుకులు పేదరికంలో మగ్గకూడదని.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలను కలలు కన్నది. ఇదిలా ఉంటే 2016లో ఛత్తీస్‌గఢ్ రోడ్డు నిర్మాణ ప్రాజెక్ట్లో జేసీబీ ఆపరేటర్‌గా పని చేసేటప్పుడు లాల్కీ బాయిని చూశాడు సంతోష్ పటేల్. ప్రాజెక్ట్ ముగిశాక కొన్ని నెలలకు ఆమెను కాంటాక్ట్ చేశాడు. అత్యున్నత పోలీస్ అధికారిగా పరిచయం చేసుకుని.. ఆమె కొడుకులకు గ్యారెంటీగా పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తాని.. ఇందుకు కొంత ఖర్చు అవుతుందని చెప్పాడు. తాను డీఎస్పీనని ప్రూఫ్స్ చూపించాడు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జేసీబీ ఆపరేటర్ అయిన సంతోష్ పటేల్.. మధ్యప్రదేశ్ సిధీ జిల్లా చుర్‌హట్ పోలీస్ స్టేషన్ కింద పడ్ఖురి పచోఖర్ గ్రామానికి చెందినవాడు. కాగా నిజమైన DSP (డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) సంతోష్ పటేల్.. బలాఘట్ జిల్లాలో హాక్ ఫోర్స్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్నాడు. 22 లక్షల మంది సోషల్ మీడియా ఫాలోవర్లను కలిగి ఉన్నాడు కూడా. కాగా ఈ జేసీబీ డ్రైవర్ DSP ఫోటోను తన WhatsApp ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించాడు. వీడియో కాల్స్, డైరెక్ట్ మీటింగ్స్ కాకుండా.. కేవలం వాయిస్ చాట్స్‌ వరకు మాత్రమే అనుమతించాడు. ఈ క్రమంలోనే లాల్కీ బాయి కూడా లక్షల మంది ఫాలోవర్స్ కలిగిన నిజమైన డీఎస్పీ అని నమ్మింది.

2018 నుంచి 2025 వరకు.. అప్లికేషన్ ఫీజు, సీనియర్ అధికారులకు లంచం, ట్రైనింగ్ ఖర్చులు అంటూ ఫోన్ పే ద్వారా ఏకంగా రూ. 72 లక్షలు దోచేశాడు. ఇందుకోసం ఆమె ఉన్న భూమిని అమ్మేసి బంధువుల దగ్గర పెద్ద మొత్తంలో అప్పులు చేసింది. ఆర్థికంగా దారుణమైన స్థితికి వచ్చేసింది. మొత్తానికి ఇదేదో స్కామ్ మాదిరిగా ఉందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఇది పర్సనల్ మ్యాటర్ అని పోలీసులు ఆమె ఫిర్యాదును తిరస్కరించారు. దీంతో లాల్కీ బాయి ప్రధానమంత్రి కార్యాలయం, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేక అప్పీల్ చేసింది. దీంతో పెద్ద స్థాయిలో చర్య తీసుకోబడింది.

నవంబర్ 12న బలరాంపూర్‌లోని కుస్మీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ నంబర్, మనీ ట్రాన్సాక్షన్స్‌ను బట్టి ఫేక్ డీఎస్పీని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిజమైన డీఎస్పీని కాంటాక్ట్ చేసిన పోలీసులు జరిగింది వివరించగా అతను కూడా షాక్ అయ్యాడు. ఆ తర్వాత బాధితురాలితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. జరిగింది చెప్పగా.. తాను నిజమైన డీఎస్పీనే తనను మోసం చేశాడని అనుకున్నానని.. ఇంత జరిగిందని తెలియదని బాధపడింది. కాగా పోలీసులు ఆమెకు డబ్బులు తిరిగిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Next Story