Rocket Attack: మణిపూర్‌లో రాకెట్ దాడి.. ఇద్దరు చిన్నారుల మృతి

by Kema Shiva Kumar |

మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన ఘోర రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, వారి తల్లి తీవ్రంగా గాయపడ్డారు.

Rocket Attack: మణిపూర్‌లో రాకెట్ దాడి.. ఇద్దరు చిన్నారుల మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్ (Manipur) రాష్ట్రంలో మళ్లీ హింస మొదలైంది. బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలో జరిగిన రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో లోయ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఇవాళ తెల్లవారుజామున మొయిరాంగ్ పరిధిలోని త్రోంగ్లాబీ అవాంగ్ లైకై గ్రామంలో ఒక పౌరుడి ఇంటిపై రాకెట్ వచ్చి పడింది. ప్రస్తుతం రాష్ట్రం బయట విధులు నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్ (BSF) కానిస్టేబుల్ ఓయినం మాలెంన్గాన్బా (Oinam Malemnganba) నివాసమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న ఆయన ఐదేళ్ల కుమారుడు, ఐదు నెలల పసికందు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వారి తల్లి బినిత (37) ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

ప్రజల ఆగ్రహం.. ఆందోళనలు

రాకెడ్ పడిన వార్త తెలియగానే బిష్ణుపూర్ జిల్లాలో ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చారు. నిరసనకారులు 2 ఆయిల్ ట్యాంకర్లు, ఒక ట్రక్కుకు నిప్పు పెట్టారు. మొయిరాంగ్ పోలీస్ స్టేషన్ (Moirang Police Station) ఎదుట భారీగా గుమిగూడి నిరసన తెలిపారు. పరిస్థితి విషమించకుండా ప్రభుత్వం వెంటనే లోయ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సరిహద్దు కొండ ప్రాంతాల నుంచి ఈ రాకెట్లను ప్రయోగించి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. నిందితుల కోసం కొండ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే థొంగమ్ శాంతి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

Next Story