అంతర్​ రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్​

by Dishafeatures2 |
అంతర్​ రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వేర్వేరు అంతర్​రాష్ర్ట గ్యాంగులను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు కోటీ 15లక్షల రూపాయల విలువ చేసే 380 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు నాలుగు కార్లు, తొమ్మిది సెల్​ఫోన్లను సీజ్​చేశారు. రాచకొండ కమిషనర్​డీ.ఎస్.చౌహాన్​సోమవారం ఎల్బీనగర్​లోని క్యాంప్​కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్​లోని అప్పర్​సీలేరు ప్రాంతం నుంచి కొంతమంది పెద్ద మొత్తంలో గంజాయిని తెలంగాణ మీదుగా మహారాష్ర్టలోని షోలాపూర్​కు తరలిస్తున్నట్టుగా అందిన సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్వోటీ అధికారులు, చౌటుప్పల్​పోలీసులతో కలిసి సోమవారం నిఘా పెట్టి వాహనాల తనిఖీ చేపట్టారు.

ఈ క్రమంలో రెండు కార్లను ఆపి తనిఖీ చేయగా వాటిలో 160 కిలోల గంజాయి దొరికింది. దీనిని స్మగుల్​చేస్తున్న దారావత్​పుల్సింగ్​(45), మహ్మద్​గౌస్​పాషా (33), బుక్యా భిక్షపతి (38), షేక్​మొయినుద్దీన్​(34)లను అరెస్టు చేశారు. విచారణలో తేలికగా డబ్బు సంపాదించటానికి అలవాటుపడ్డ దారావత్​పుల్సింగ్​చాలారోజులుగా మహ్మద్​గౌస్​పాషాతో కలిసి అప్పర్​సీలేరు ప్రాంత వాస్తవ్యుడు బాలు నుంచి కొని గంజాయిని షోలాపూర్​కు చెందిన లింబాజీకి అమ్ముతూ వస్తున్నాడు. ఎప్పటిలానే మహ్మద్​గౌస్​పాషా, బుక్యా భిక్షపతి, షేక్​మొయినుద్దీన్​తో కలిసి అప్పర్​సీలేరు వెళ్లి 160 కిలోల గంజాయి కొని రెండు కార్లలో షోలాపూర్​కు బయల్దేరాడు. ఈ మేరకు సమాచారం అందటంతో మల్కాజిగిరి ఎస్వోటీ అధికారులు, చౌటుప్పల్​పోలీసులు కలిసి సోమవారం తెల్లవారుఝామున వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో గంజాయిని తరలిస్తున్న నలుగురు వారి చేతికి చిక్కారు. ఈ కేసులో బాలు, లింబాజీ పరారీలో ఉన్నట్టుగా కమిషనర్​డీ.ఎస్.చౌహాన్​చెప్పారు.

మరో గ్యాంగ్..

అప్పర్​సీలేరు ప్రాంతం నుంచే గంజాయిని హైదరాబాద్, మహారాష్ర్టలోని బుల్దారా సిటీకి స్మగుల్​చేస్తున్న మరో గ్యాంగును మల్కాజిగిరి ఎస్వోటీ అధికారులు, యాచారం పోలీసులు కలిసి పట్టుకున్నారు. వీరి నుంచి 220 కిలోల గంజాయి, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​యాఖుత్​పురాకు చెంవిన మహ్మద్​ఫిరోజ్​(44), టప్పాఛబుత్రా నివాసి దినేష్​సింగ్​(28), మలక్​పేట వాస్తవ్యుడు మహ్మద్​ఖాదర్​(28), వట్టేపల్లికి చెందిన అబ్దుల్​రవూఫ్​(28), కార్వాన్ నివాసి సతీష్​(25)ల మధ్య పరిచయం ఉంది. వీరిలో మహ్మద్​ఫిరోజ్, దినేష్​సింగ్​లకు అప్పర్​సీలేరు ప్రాంతంలోని గంజాయి విక్రేతలతో పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలో తేలికగా డబ్బు సంపాదించటానికి ఈ ఇద్దరు కలిసి చాలా రోజులుగా గంజాయి స్మగ్లింగ్​చేస్తున్నారు.

ఎప్పటిలానే ఇటీవల అప్పర్​సీలేరు వెళ్లిన వీళ్లు ముకుంద్​అనే వ్యక్తి నుంచి 220 కిలోల గంజాయిని కొన్నారు. దీంట్లో నుంచి కొంత హైదరాబాద్​కు చేరవేసి మిగితా గంజాయిని మహారాష్ర్ట బుల్దానా సిటీ నివాసి ఠాకూర్​కు ఇవ్వటానికి రెండు కార్లలో బయల్దేరారు. ఈ మేరకు సమాచారం అందటంతో ఎస్వోటీ అధికారులు, యాచారం పోలీసులు నిఘా పెట్టి మహ్మద్​ఫిరోజ్, దినేష్​సింగ్, మహ్మద్​ఖాదర్, అబ్దుల్​రవూఫ్​లను అరెస్టు చేశారు. అప్పర్​సీలేరుకు చెందిన ముకుంద్, బుల్దానా సిటీ నివాసి ఠాకూర్​పరారీలో ఉన్నట్టు కమిషనర్​డీ.ఎస్.చౌహాన్​చెప్పారు. ఎస్వోటీ డీసీపీ గిరిధర్​పర్యవేక్షణలో ఈ రెండు గ్యాంగులను అరెస్టు చేసిన పోలీసు ఇన్స్​పెక్టర్లు దేవేందర్, లింగయ్య, రాములు, సబ్​ఇన్స్​పెక్టర్లు వాసుదేవ్, రఘురాముడు తదితరులను కమిషనర్​అభినందించారు.

Next Story

Most Viewed