శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పేలిన ఫోన్ బ్యాటరీ.. తప్పిన పెను ప్రమాదం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-14 08:37:30  IST  )

శంషాబాద్ విమానాశ్రయంలో బ్లాస్ట్ కలకలం రేపింది. ఓ ప్రయాణికుడి లగేజీ తనిఖీ చేస్తుండగా అకస్మాత్తుగా సెల్‌ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పేలిన ఫోన్ బ్యాటరీ.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఇవాళ ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రయాణికుడి బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలడంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. భద్రతా సిబ్బంది కథనం మేరకు.. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌ వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానం ఎక్కే ముందు నిబంధనల ప్రకారం భద్రతా సిబ్బంది లగేజీ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుడి బ్యాగ్‌ను స్కాన్ చేస్తున్న సమయంలో అందులోని సెల్‌ఫోన్ బ్యాటరీ (Mobile Battery) ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బ్యాగు నుంచి పొగలు రావడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

అయితే, పేలుడు ధాటికి సిబ్బంది, ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అగ్నిమాపక, భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్యాటరీ నాణ్యత లోపం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటన కారణంగా రాయ్‌పూర్ విమానం కొంత సమయం ఆలస్యంగా బయలుదేరింది.

Next Story