సిటీలో అద్దె ఫ్లాట్‌ నుంచి సట్టా బెట్టింగ్ దందా.. ఆరుగురు అరెస్ట్

by Bhanu |

హైదరాబాద్ నగరంలోని బాగ్ అంబర్ పేట్ ప్రాంతంలో అద్దె ఫ్లాట్‌లో ఏర్పాటుచేసిన సట్టా బెట్టింగ్ కేంద్రాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. నంబర్లపై పందెం కాయించే ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

సిటీలో అద్దె ఫ్లాట్‌ నుంచి సట్టా బెట్టింగ్ దందా.. ఆరుగురు అరెస్ట్
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ నగరంలోని బాగ్ అంబర్ పేట్ ప్రాంతంలో అద్దె ఫ్లాట్‌లో ఏర్పాటుచేసిన సట్టా బెట్టింగ్ కేంద్రాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. నంబర్లపై పందెం కాయించే ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, అరెస్టైనవారు.. వొడ్డేపల్లి నవీన్, పుదరి సాయికిరణ్, సోమ మహేందర్, బింగి సాయికిరణ్, బి. అవినాష్, సాన సాయిప్రీతమ్ — వీరందరూ కాగజ్‌నగర్‌కు చెందిన స్నేహితులు. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై వీరికి మంచి అవగాహన ఉండటంతో కలిసి హైదరాబాదులో దందా ప్రారంభించాలని నిశ్చయించారు. రూ.14 వేల అద్దెతో బాగ్ అంబర్ పేట్‌లో ఒక ఫ్లాట్‌ను తీసుకొని, అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించారు.

వేర్వేరు నకిలీ పేర్లతో (కళ్యాణ్ రిజల్ట్, ఆశ్విన్ నాయక్, టీర్ షిలాంగ్ కౌంటర్, అర్జున్ సర్కార్, విశాల్ కె) ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి, వాటి ద్వారా పందెం రాయుళ్లను ఆకర్షించేవారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1000 నుండి రూ.2000 వసూలు చేసి, కొద్ది మొత్తాల బెట్టింగ్‌లకు లాభాలు ఇచ్చి, పెద్ద మొత్తాలకు ప్రోత్సహించి తర్వాత మోసం చేసేవారు.

ప్రమాదకరంగా విస్తరిస్తున్న ఈ మోసాన్ని గుర్తించిన టాస్క్ ఫోర్స్ బృందం అక్కడ సోదాలు జరిపి, 17 మొబైల్ ఫోన్లు, ఒక కారు, రూ.79 వేల నగదుతో పాటు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఖాతాలను ఫ్రీజ్ చేస్తూ, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Next Story