మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు.. నిందితులను విచారిస్తున్న సిట్

by Kema Shiva Kumar |

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు ముగ్గురు నిందితులను ఇవాళ విచారిస్తున్నారు.

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు.. నిందితులను విచారిస్తున్న సిట్
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ పార్టీ కేసును తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసు మూలాలను, అంతర్జాతీయ సంబంధాలను ఛేదించేందుకు ఇటీవలే రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT - Special Investigation Team) ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఇవాళ కేసులో పట్టుబడిన ముగ్గురు ప్రధాన నిందితులు నమిత్ శర్మ ఆయన సోదరుడు రితీష్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

డ్రగ్స్ మూలాలపై ఆరా..

ఫామ్‌హౌస్‌లో పార్టీ కోసం డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు.. దీని వెనుక ఉన్న డ్రగ్ పెడ్లర్లు ఎవరు? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రధానంగా బెంగళూరు లేదా గోవా నుంచి ఈ సరఫరా జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నిందితుల ఫోన్ కాల్ డేటా, సోషల్ మీడియా చాటింగ్స్ ఆధారంగా నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

పార్టీలో పాల్గొన్న వారెవరు..?

మొయినాబాద్ ఫామ్‌హౌస్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీకి హాజరైన వారిలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. సిట్ అధికారులు ఫామ్‌హౌస్‌లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని, లోతుగా పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం మరికొంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story