కేషన్ ఇండస్ట్రీస్ ఘరానా మోసం.. రూ.100 కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేత

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-30 15:35:04  IST  )

జీఎస్టీ (GST) చెల్లింపుల్లో మరో భారీ మోసాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు.

కేషన్ ఇండస్ట్రీస్ ఘరానా మోసం.. రూ.100 కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేత
X

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ (GST) చెల్లింపుల్లో మరో భారీ మోసాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ (Hyderabad)లోని కేషన్ ఇండస్ట్రీస్ (Keshan Industries) రాగి ఉత్పత్తులను తయారు చేస్తుంది. ముఖ్యంగా రాగి వాటర్ బాటిల్స్, రాగి కప్పులు, పూజా పాత్రలను సొంతంగా తయారు చేసి ఇండియా మార్ట్ (India Mart) ద్వారా విక్రయిస్తుంటారు. కేషన్ ఇండస్ట్రీస్‌ను 2016‌లో వికాష్ కుమార్ కేషన్, రజనీశ్ కుమార్ కేషన్ స్థాపించారు. అయితే, తాజాగా కేషన్ ఇండస్ట్రీస్ గోదాములపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దాడులు చేశారు.

ఈ క్రమంలోనే సదరు సంస్థ రూ.100 కోట్లకు పైగా జీఎస్టీ మోసానికి పాల్పడినట్లుగా తేలింది. కాపర్ వస్తువులు ఇతర రాష్ట్రాలకు తరలించకుండానే నకిలీ వే బిల్లులను (Fake Way Bills) సంస్థ సృష్టించింది. అదేవిధంగా ఖాళీ వాహనాలను తెలంగాణ (Telangana)-మహారాష్ట్ర (Maharashtra) మధ్య నడిపి.. ఆ డాక్యుమెంట్లతో భారీగా సరుకుల రవాణా జరిగినట్లు చూపించారు. నకిలీ వే బిల్లులతో రూ.33.20 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌‌ను కేషన్ ఇండస్ట్రీస్ పొందినట్లుగా అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఆ సంస్థ డైరెక్టర్లు వికాశ్ కుమార్ కేషన్, రజనీష్ కుమార్ కేషన్‌పై సీసీఎస్‌లో కేసు నమోదైంది.

Next Story