ఇరిగేషన్ మాజీ ఈఎన్‌సీ హరిరామ్ అరెస్ట్.. అక్రమ ఆస్తులు వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం!

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-26 17:38:30  IST  )

కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఇరిగేషన్ మాజీ ఈఎన్‌సీ హరిరామ్ అరెస్ట్.. అక్రమ ఆస్తులు వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరిగేషన్ మాజీ ఈఎన్‌సీ భూక్యా హరిరామ్‌పై ఏసీబీ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. హరిరామ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో, బంధువుల నివాసాల్లో దాడులు జరిపారు. మొత్తం 14 చోట్ల తనిఖీలు చేశారు. భారీగా అక్రమ ఆస్తులను గుర్తించి.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కారు, బంగారం, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

అమరావతిలో వాణిజ్య స్థలం, ఆరు ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ఫామ్‌హౌజ్, గజ్వేల్‌లో భారీగా ఆస్తులు, హైదరాబాద్‌లోని షేక్‌పేట్, కొండాపూర్‌లో విల్లాలు, శ్రీనగర్, మాదాపూర్, నార్సింగిలో ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన్ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ పురోగతిలో ఉందని తెలిపారు. ఈ సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

కాళేశ్వరం అనుమతుల్లో హరిరామ్ కీలకం

కాళేశ్వరం అనుమతులు, రుణాల సమీకరణలో ఈఎన్సీగా హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. కాళేశ్వరం రీ డిజైన్‌లోనూ ఆయన పాత్ర ఉంది. హరిరామ్ సతీమణి అనిత కూడా నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా పనిచేసిన అనుభవంతో వాలంటరీ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్నారు. దీంతో 2023 సెప్టెంబర్ 27న జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ హరిరామ్‌ను విచారించింది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రూ.64,000 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు చెల్లించామని.. బ్యాంకులకు రూ.29,737 కోట్ల రీపేమెంట్ చేసినట్లు హరిరామ్ తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీ గేట్ల నిర్వహణలో తడవు వల్లే నష్టం జరిగిందని స్టేట్‌మెంట్ ఇచ్చారు. 2017లో ఉన్నతస్థాయి కమిటీ సూచనలను చీఫ్ ఇంజినీర్ అమలు చేయలేదని కూడా వెల్లడించారు. ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న కమిషన్.. విచారణ జరుపుతున్న సమయంలోనే ఏసీబీ దాడులు జరగటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Next Story