ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు.. భారత్ చేతికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-10 12:33:43  IST  )

మోస్ట్ వాంటెడ్ నేరగాడు అభయ్ రాణాను పోర్చుగల్ నుంచి సీబీఐ అధికారులు భారత్‌కు విజయవంతంగా తీసుకొచ్చారు.

ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు.. భారత్ చేతికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశాల్లో తలదాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ నేరగాడు అభయ్ రాణా (Abhay Rana)ను భారత్ విజయవంతంగా రప్పించింది. పోర్చుగల్ ప్రభుత్వం అతడిని భారత దర్యాప్తు సంస్థలకు అప్పగించడంతో ఆదివారం ఉదయం ఢిల్లీ (Delhi) విమానాశ్రయానికి భారీ భద్రత మధ్య తీసుకువచ్చారు. హర్యానాకు చెందిన అభయ్ రాణాపై హత్యలు, కిడ్నాపులు, అనేక నేరాలకు (Organized Crime) సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. 2022లో నకిలీ పాస్‌పోర్ట్‌తో భారత్ నుంచి పారిపోయిన రాణా, అప్పటి నుంచి యూరప్‌లోని వివిధ దేశాల్లో తలదాచుకుంటూ తన గ్యాంగ్‌ను నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత్ విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ అతడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

అప్పగింత ప్రక్రియ..

గతేడాది పోర్చుగల్ (Portugal) పోలీసులు రాణాను అరెస్ట్ చేయగా.. అప్పటి నుంచి అతడిని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, సీబీఐ (CBI) నిరంతరం ప్రయత్నించాయి. పోర్చుగల్ కోర్టులో భారత ప్రభుత్వం బలమైన సాక్ష్యాధారాలను సమర్పించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అతడిని భారత్‌కు అప్పగించేందుకు పోర్చుగల్ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అభయ్ రాణాను ఇప్పుడు హర్యానా (Haryana) పోలీసులకు అప్పగించనున్నారు. అతడి వెనుక ఉన్న నెట్‌వర్క్ గురించి విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. అభయ్ రాణా అరెస్ట్‌తో ఉత్తర భారతంలోని పలు గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌ల గుట్టు రట్టయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Next Story