హైదరాబాద్‌లో ఘోరం..భార్యను వివస్త్రను చేసి, గుండు గీసి హత్యచేసిన భర్త

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-06 06:42:43  IST  )

హైద‌రాబాద్ బోర‌బండ‌లో దారుణం చోటు చేసుకుంది. సాయిబాబాన‌గ‌ర్‌లో భార్య‌ను భ‌ర్త దారుణంగా హ‌త్య చేశాడు. సాయిబాబాన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న న‌ర్సింహులు మ‌ద్యం

హైదరాబాద్‌లో ఘోరం..భార్యను వివస్త్రను చేసి, గుండు గీసి హత్యచేసిన భర్త
X

దిశ‌, వెబ్ డెస్క్/ జూబ్లీహిల్స్: హైద‌రాబాద్ బోర‌బండ‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య‌ను భ‌ర్త దారుణంగా హ‌త్య చేశాడు. సాయిబాబాన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న ఓర్సు నర్సింహులు (36) మ‌ద్యం మత్తులో త‌న భార్య ఓర్సు సోని(26)కి గుండు గీసి, వివ‌స్త్ర‌ను చేసి అత్యంత పాశవికంగా దాడి చేశాడు. ఆమెపై దాడి చేసి వివ‌స్త్ర‌ను చేసిన త‌ర‌వాత ఆమె దుస్తుల‌ను సైతం త‌గ‌ల‌బెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓర్సు నర్సింహులు పై పలు పోలీస్‌ స్టేషన్లలో 16 కేసులు నమోదై ఉన్నాయి. మూడు రోజుల క్రితం బోరబండలోని నాగుల ఎల్లమ్మ ఆలయంలో హుండీ చోరీ అయ్యింది. పోలీసులు ఆలయం సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా నర్సింహులు చోరీ చేసినట్లు గుర్తించారు. బోరబండ ప్రాంతంలో శుక్రవారం మత్తులో ఉన్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సింహులు ఉండే ఇంటికి బయటి నుంచి గడియ పెట్టి ఉండటాన్ని సమీపంలోని బంధువులు గమనించారు. నర్సింహులు భార్య ఓర్సు సోని ఉదయం నుంచి కనిపించకపోవడంతో వారికి అనుమానం వచ్చింది.

దీంతో తలుపు తీసి చూడగా ఆమె అచేతనంగా పడిపోయి కనిపించింది. వారు 100కు సమాచారం అందించగా బోరబండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి సమాచారంతో అక్కడికొచ్చిన 108 సిబ్బంది ఆమెను పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు ఇంట్లోని వాతావరణం అనుమానాస్పదంగా కనిపించింది. సోని జుత్తును తొలగించి గుండుతో ఉండటమే కాకుండా అక్కడ దుస్తులను కాల్చినట్లు గుర్తించారు. సోని శరీరం పై నర్సింహులు దుస్తులు కప్పి ఉండటంతో పాటు ఆమె శరీరం పై గాయాలు ఉన్నాయి. నర్సింహులును విచారించగా తానే గుండు చేసినట్లు, వివస్త్రగా మార్చి ఆమె వస్త్రాలను దగ్ధం చేసినట్లు ప్రాథమికంగా అంగీకరించాడు. హుండీలో చోరీ చేసిన సొత్తుతో మద్యం మత్తులో భార్య సోనిని రెండు రోజులుగా తీవ్రంగా కొట్టినట్లు గుర్తించారు. ఆమె అంతర్గత భాగాల్లోనూ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమె బంధువులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. శవపరీక్ష నిమిత్తం పోలీసులు సోని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story