భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్, మరొకరు పరారీ..

by Disha Web Desk 11 |
భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్, మరొకరు పరారీ..
X

దిశ, శంషాబాద్: గంజాయిని అక్రమ రవాణా చేస్తూ ఎస్ఓటీ పోలీసులకు అడ్డంగా దొరికిన ఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైతాబాద్ వద్ద చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైతాబాద్ గ్రామ సమీపంలో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. రాజమండ్రికి చెందిన కోమలి రామకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి అక్కడే టెన్నీస్ కోచ్ గా ఐదు సంవత్సరాలు పనిచేశాడు.


అనంతరం గంజాయి సప్లై చేయడం మొదలుపెట్టాడు. సుమారు మూడు సంవత్సరాల క్రితం తెలిసిన స్నేహితులతో పాటు గంజాయి సప్లై చేయడానికి సహాయంగా వెళ్లాడు. రెండు సంవత్సరాల క్రితం విజయవాడలోని కంచికచర్ల పోలీసులకు గంజాయి సప్లై చేస్తూ అడ్డంగా దొరకడంతో కొన్ని రోజులు గంజాయి సప్లై చేయడం ఆపేశాడు. అనంతరం సంవత్సరం క్రితం లంబసింగికి చెందిన కృష్ణ పరిచయమయ్యాడు. ఇద్దరు కలిసి గంజాయి సప్లై చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా లంబసింగ్ కృష్ణ, దూల్ పేటకు చెందిన సూర్యరాజ్ తో కూడా పరిచయం ఉంది. మంగళవారం లంబసింగి కృష్ణ కోమలి కృష్ణకి ఫోన్ చేసి సరుకు సప్లై ఉందని విజయవాడకు రమ్మని పిలిచాడు.

దానితో కోమలి కృష్ణ వారి బంధువుల పుట్టినరోజు ఉందని కారు తీసుకొని విజయవాడకు వెళ్లి అక్కడ కృష్ణ వద్ద ఉన్న 115 గంజాయి ప్యాకెట్లను తీసుకొని హైదరాబాద్ లో ఉన్న సూర్య రాజ్ సింగ్ వద్దకు కారులో బయలుదేరి హైదరాబాద్ కి గురువారం తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి, సూర్య రాజ్ సింగ్ కి ఫోన్ చేయగా హైదరాబాదులో పోలీస్ చెకింగ్ ఎక్కువగా ఉంటుందని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ వద్ద కలవాలని చెప్పారు. గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో హైతాబాద్ వద్దకు వచ్చి గంజాయి కారు నుంచి మార్చుతుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.

వారి వద్ద నుంచి రూ. 46 లక్షల విలువ చేసే 230 కేజీల గంజాయి ప్యాకెట్లను, మూడు సెల్ ఫోన్లు, ఒక కారు, ఒక బైకు, రూ. 8.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులు కోమలి రామకృష్ణ, సూర్య రాజ్ సింగ్ అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఏ1 నిందితుడు లంబసింగి కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సాధనా రేష్మి పెరుమాళ్, రాజేంద్రనగర్ ఎస్ఓటీ డీసీపీ రషీద్, చేవెళ్ల ఏసీపీ ప్రభాకర్, షాబాద్ ఇన్ స్పెక్టర్ గురువయ్య, ఎస్ఓటీ జోన్ ఇన్ స్పెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story