రాష్ట్రంలో గుండెలు బద్దలయ్యే విషాదం.. ముగ్గురు కూతుళ్లను చంపి తండ్రి బలవన్మరణం

by Kema Shiva Kumar |

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీ అగ్రహారంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

రాష్ట్రంలో గుండెలు బద్దలయ్యే విషాదం.. ముగ్గురు కూతుళ్లను చంపి తండ్రి బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: కూతుళ్లను కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఆ చిన్నారుల పాలిట కాలయముడయ్యాడు. భార్య వదిలేసి వెళ్లిపోయిందనే తీవ్ర మనస్తాపంతో ముగ్గురు అమాయక ఆడబిడ్డలను అత్యంత అమానుషంగా హతమార్చి, ఆపై తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘోర ఉదంతం ప్రకాశం (Prakasam) జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండల పరిధిలోని కేవీ అగ్రహారానికి (KV Agraharam) చెందిన సుధాకర్‌ అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు అచ్యుత, పూజిత, లోహిత ఉన్నారు. కొంతకాలంగా కుటుంబంలో జరుగుతున్న గొడవల కారణంగా సుధాకర్ భార్య, భర్తను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అయితే, భార్య తనను వదిలి వెళ్లిపోవడాన్ని సుధాకర్ తట్టుకోలేకపోయాడు. గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన, జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కన్నకూతుళ్లని కూడా పొట్టనబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి సమయంలో ముగ్గురు కుమార్తెలు అచ్యుత, పూజిత, లోహితలను చంపేసి.. అనంతరం సుధాకర్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..

ఉదయం ఇంట్లో నుంచి ఎలాంటి చప్పుడు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా నలుగురి మృతదేహాలు కనిపించాయి. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతతరం స్పాట్‌కు చేరుకున్న చీమకుర్తి పోలీసులు (Cheemakurthi Police) డెడ్‌బాడీలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లే ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంద.

Next Story