రాష్ట్రంలో హృదయవిదారక ఘటన: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-22 03:14:53  IST  )

చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లెలో గుండెలు పగిలే విషాదం చోటుచేసుకున్నది.

రాష్ట్రంలో హృదయవిదారక ఘటన: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు (Chittoor) పరిధిలోని బంగారెడ్డిపల్లె (Bangareddipalle)లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగారెడ్డిపల్లెకు చెందిన దామోదరం (30), నిర్మల (25) దంపతులకు కుమారుడు రాజేష్, కుమార్తె శ్రీవిద్య ఉన్నారు. కొద్దిరోజుల క్రితం భార్య నిర్మలకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో దామోదరం తన భార్యను వేలూరులోని సీఎంసీ (CMC) ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాడు. అయితే, మధ్యతరగతి కుటుంబం కావడంతో వైద్యానికి భారీగా ఖర్చయింది. రోజురోజుకూ భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, మరోవైపు వైద్య ఖర్చుల వల్ల ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారి అంతంతమాత్రంగా మారడంతో దామోదరం తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. జీవితంపై విరక్తి చెంది కుటుంబంతో సహా తనువు చాలించాలని భావించాడు.

పిల్లలకు విషమిచ్చి.. తానూ ఉరేసుకుని

ఈ క్రమంలోనే దామోదరం పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లో ఉన్న భార్య నిర్మల, కుమారుడు రాజేష్, కుమార్తె శ్రీవిద్యలకు విషం ఇచ్చి హతమార్చాడు. ఆ తర్వాత వారు మరణించారని నిర్ధారించుకున్నాక, తను కూడా ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఎంతసేపటికీ ఆ ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు లోపలికి వెళ్లి చూడగా.. నలుగురు విగతజీవులుగా పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు.

కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్..

ఆత్మహత్యకు ముందు దామోదరం రాసిన సూసైడ్ నోట్ అక్కడున్న వారిని, పోలీసులను కన్నీరు పెట్టించింది. చనిపోయాక తమ అంత్యక్రియల ఖర్చుల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని దామోదరం భావించాడు. తన అంత్యక్రియల ఖర్చుల కోసం తన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులనే వాడుకోవాలని ఆ నోట్‌లో కోరాడు. అందుకోసం ఎవరికీ ఇబ్బంది లేకుండా తన ఏటీఎం (ATM) కార్డ్ పిన్ నంబర్, ఫోన్‌పే (PhonePe) పిన్ నంబర్లను కూడా ఆ సూసైడ్ నోట్‌లో స్పష్టంగా రాసి పెట్టాడు. అయితే, సమాచారం అందుకున్న బీఎన్‌ఆర్‌ పేట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, ఘటనా స్థలంలో ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి సామూహిక ఆత్మహత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story