లక్షకు రూ.3వేల వడ్డీ ఇస్తానని రూ.8కోట్లు కొట్టేశాడు..చివరికి ఇలా దొరికిపోయాడు

by Ajay Maddhiboyina |

లక్షకు రూ.3వేల వడ్డీ ఇస్తానని రూ.8కోట్లు కొట్టేశాడు..చివరికి ఇలా దొరికిపోయాడు
X

దిశ, వెబ్ డెస్క్: ల‌క్ష‌కు రూ.3వేలు వ‌డ్డీ ఇస్తాన‌ని మాయ‌మాట‌లు చెప్పి ఓ కేటుగాడు ప్ర‌జ‌ల నుండి రూ.8 కోట్లు వ‌సూలు చేసి పరార్ అయ్యాడు. ఈ ఘ‌ట‌న ఏపీలోని అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో చోటు చేసుకుంది. క‌డ‌ప‌కు చెందిన ఆరిఫ్ అనే వ్య‌క్తి తాడిప‌త్రిలో ఉంటూ బంగారం వ్యాపారిని అని స్థానికుల‌ను న‌మ్మించాడు. ల‌క్ష రూపాయ‌లు ఇస్తే ప్ర‌తి నెల రూ.3వేలు వ‌డ్డీ ఇస్తాన‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించాడు. కొన్ని రోజుల వ‌ర‌కు వ‌డ్డీ కూడా చెల్లించాడు. అలా ఒక్కొక్క‌రి నుండి ల‌క్ష నుండి యాభై ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూలు చేశాడు.

డ‌బ్బుతో పాటు కొంత‌మంది ద‌గ్గ‌ర బంగారం కూడా తీసుకుని వ‌డ్డీ ఇస్తాన‌ని చెప్పాడు. అలా తీసుకున్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి డ‌బ్బులు తీసుకున్నాడు. ఇలా మొత్తంగా ప్ర‌జ‌ల నుండి రూ.8 కోట్లు కొట్టేసి పరార్ అయ్యాడు. నాలుగు రోజుల క్రితం బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా కేసు న‌మోదు చేసుకుని క‌డ‌ప జిల్లాలోని కొండాపురం రైల్వే ట్రాక్ ప‌రిస‌రాల్లో నిందితుడు ఉన్న‌ట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ కేసు పై విచార‌ణ జ‌రుగుతోంది.

Next Story