‘రహేజా డెవలపర్స్‌’పై ఈడీ పంజా: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఏడు చోట్ల సోదాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-25 08:53:19  IST  )

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘రహేజా డెవలపర్స్’ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేపడుతున్నారు.

‘రహేజా డెవలపర్స్‌’పై ఈడీ పంజా: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఏడు చోట్ల సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ప్రాంతం (NCR)లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘రహేజా డెవలపర్స్’ (Raheja Developers)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి రహేజా డెవలపర్స్, ఆ సంస్థ డైరెక్టర్లు, అనుబంధ సంస్థలకు చెందిన ఏడు ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

మోసం, భారీగా నిధుల మళ్లింపు ఆరోపణలు..

‘రహేజా రేవంత’ (Raheja Revanta) ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్లను మోసం చేసినట్లుగా ఈ సంస్థపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. హోమ్ బయ్యర్ల నుంచి భారీగా నిధులు సేకరించి, గడువు ముగిసినా ఫ్లాట్లు డెలివరీ చేయకుండా నిధులను ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ, గురుగ్రామ్ సహా ఎన్‌సీఆర్ పరిధిలోని కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి చేయకుండా తమను నట్టేట ముంచారని వందలాది మంది కొనుగోలుదారులు గతంలో పోలీసులకు, రెరా (RERA)కు ఫిర్యాదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్‌ల ఆధారంగానే మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది.

కాగా, గురుగ్రామ్‌లోని సెక్టార్ 78లో చేపట్టిన ఈ విలాసవంతమైన ప్రాజెక్టు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం, నిధుల కొరత సాకుతో నిర్మాణాలు నిలిపివేయడంపై కొనుగోలుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈడీ సోదాలతో రహేజా యాజమాన్యం చిక్కుల్లో పడినట్లైంది.

Next Story