24 గంటల వ్యవధిలో తల్లీ, కొడుకుల మృతి

by Disha Web Desk 1 |
24 గంటల వ్యవధిలో తల్లీ, కొడుకుల మృతి
X

తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో విషాదం

దిశ, తిమ్మాపూర్ : భార్య మృతిని తట్టుకోలేక భర్త పురుగుల మందు తాగి చనిపోతే.. తను ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతిని తట్టుకోలేక ఆ తల్లి గుండె ఆగిపోయిన ఘటన తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో కేవలం 24 గంటల వ్యవధిలో కొడుకు, తల్లి ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామస్థుల కథనం మేరకు.. నేదునూరు గ్రామానికి చెందిన బొల్లంపల్లి కనకయ్య-కనకలక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు. అదేవిధంగా వారికి ఒక్కగానోక్క కొడుకు శ్యామసుందర్ (35) ఉన్నాడు.

శ్యామసుందర్ కు హుస్నాబాద్ గోదాంగడ్డ కాలనీకి చెందిన శారదతో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. భార్య, భర్తలు కొంతకాలం బాగానే అన్యోన్యంగా ఉన్నారు. పుట్టింటికి వెళ్లిన శారద సెప్టెంబర్ 20న తన ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించింది. ఆమెను మరిచిపోలేని శ్యామసుందర్ తన పెళ్లి రోజైన మే15 కాగా 14న రాత్రి హుస్నాబాద్ లోని అత్త వారింటికి వెళ్లి భార్య ఉరేసుకున్న చోటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

కొడుకు మృతితో ఆగిన కన్నతల్లి గుండె..

ఒక్కగానొక్క కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న తల్లి కనకలక్ష్మి రోజంతా కొడుకు మృతదేహం వద్దే గుండెలు పగిలేలా రోదించింది. సోమవారం రాత్రి కొడుకు అంత్యక్రియలు పూర్తి కాగానే ఇంటికి వచ్చిన కనకలక్ష్మికి రాత్రి 11 గంటల సమయంలో గుండె నొప్పి రావడంతో ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటినా కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు. కాగా, కేవలం 24 గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story

Most Viewed