భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ..

by Disha Web Desk 11 |
భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ..
X

దిశ, నవాబుపేట: భూ వివాదం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఓ పొలం విషయమై ఘర్షణ పడిన ఇరువర్గాలలో ఓ వర్గం వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ప్రత్యర్థి వర్గం వారి కళ్ళలో కారంపొడి చల్లి మారణాయుధాలతో దాడి చేయడంతో పలువురికి రక్త గాయాలయ్యాయి. గ్రామ శివారులోని 99 సర్వే నెంబర్ లో ఉన్న భూవివాదం కోర్టు కేసులో ఉండగానే ఓ వర్గం వారు ఆ సర్వే నంబర్ లో గల 2.20 ఎకరాల భూమిని ట్రాక్టర్లతో దున్నడానికి ఈ నెల 8వ తేదీన ప్రయత్నించగా మరో వర్గం వారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

బుధవారం ఉదయం మరోసారి ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రత్యర్థులు వాటితో భూమిని దున్నుతుండగా ఆ భూమిపై హక్కులు కలిగి ఉన్న ఆ గ్రామానికి చెందిన గజ్జి మల్లయ్య తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే అదునుగా భావించిన ప్రత్యర్థులు మల్లయ్యపై ఆయన భార్య లక్ష్మమ్మ, ఆయన చిన్నాన్న మాసయ్య, ఆయన కొడుకు మల్లయ్యల కళ్ళల్లో కారంచల్లి మారణాయుధాలతో దాడులు చేయడంతోపాటు కట్టెలతో చితకబాధగా బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయమై బాధితుడు గజ్జి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు.



Next Story

Most Viewed