కన్నతల్లినే కడతేర్చాలనుకున్న కసాయి కొడుకు..

by Disha Web Desk 1 |
కన్నతల్లినే కడతేర్చాలనుకున్న కసాయి కొడుకు..
X

ఇంట్లో ఉందనుకుని గడియ పెట్టి ఇంటికి నిప్పు

దిశ, బాన్సువాడ : కలియుగంలో మానవత్వం మంటగలిసి పోతోందనడానికి అద్దంపడుతోంది. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన గవ్వల చందవ్వ, నారాయణ దంపతులకు ఒకే ఒక కుమారుడు గవ్వల అశోక్. ఇతడు తన భార్య ,ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ లో ఉంటూ ఓ కంపెనీలో సేల్స్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో తల్లి గవ్వల చంద్రవ్వ ఒంటరిగనే ఇంటి వద్ద ఉంటూ మిగిలిన మూడు గదులను ఇతరులకు అద్దెకు ఇచ్చి కాలం వెల్లదీస్తోంది.

ఇదిలా ఉంటే సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో నుంచి మంటలు, పొగ రావడం కాలనీ వాసులు చూడగా చంద్రవ్వ బయట నుంచి రావడం చూసిన ఆమె కుమారుడు అశోక్ అక్కడి నుంచి పారిపోవడం కాలనీవాసులు గమనించారు. ఇదే విషయమై చంద్రవ్వను ప్రశ్నించగా.. తాను మాట్లాడుతూ తన కుమారుడికి తనకు చాలా రోజుల నుండి మాటలు లేవని, అయినా, హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా తనను విపరీతంగా కొట్టడం, హింసించడం చేస్తాడని, గత మూడు నెలల క్రితం కూడా ఇంటికి వచ్చినప్పుడు తనపై పెట్రోల్ పోసి నిప్పటించేందుకు ప్రయత్నించాడని తెలిపింది.

అదే మాదిరిగా శనివారం రోజు వచ్చి రెండు రోజులు బాగానే ఉన్నాడని, అయినా, తాను తన కుమారుడు మాట్లాడుకోలేదని తెలిపింది. సోమవారం ఉదయం తాను స్నానం చేసి, బట్టలు ఉతికి అరబెట్టి కాలనీలోనే తెలిసిన వాళ్లింటికి వెళ్లానని తెలిపింది. తాను ఇంట్లోనే ఉన్నాననుకొని, తన గదికి గడియ పెట్టి, తన కొడుకు ఇంటికి నిప్పు పెట్టాడని ఆమె తెలిపింది. ఈ విషయమై బీర్కూర్ ఎస్సై బాల్ రెడ్డి వివరణ కోరగా ఇంటికి నిప్పు పెట్టిన గవ్వల అశోక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలో అతడని పట్టుకుంటామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


Next Story

Most Viewed