Brutal Murder: బెంగళూరులో దారుణం.. భార్యను హతమార్చిన మాజీ ఇస్రో ఉద్యోగి

by Kema Shiva Kumar |

మానసిక ఒత్తిడి కారణంగా బెంగళూరులో ఓ మాజీ ఇస్రో ఉద్యోగి తన భార్యను టవల్‌తో గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశారు.

Brutal Murder: బెంగళూరులో దారుణం.. భార్యను హతమార్చిన మాజీ ఇస్రో ఉద్యోగి
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు నగరంలో భయానక ఘటన చోటుచేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో పనిచేసి రిటైర్ అయిన ఓ మాజీ ఉద్యోగి తన భార్య గొంతు నులిమి హత్య చేసిన ఘటన అవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగేశ్వరరావు (Nageshwar Rao), సంధ్యాశ్రీ (Sandhya Sri) భార్యభర్తలు. అయితే కొన్నాళ్ల నుంచి నాగేశ్వర్ రావు మెంటల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో తన నివాసంలోనే నాగేశ్వరరావు టవల్‌తో భార్య సంధ్యాశ్రీ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుండి పారిపోకుండా తెలిసిన వ్యక్తికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.

దీంతో హుటాహుటిన వైట్‌ఫీల్డ్ డీసీపీ సైదులు అదావత్ ఆధ్వర్యంలోని టీమ్ రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, నాగేశ్వరరావు గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక వేదనతో బాధపడుతున్నట్లుగా తెలిసింది. ఆయన తన భార్యను చంపి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరి మధ్య ఇతర గొడవలేవీ ఉన్నట్లు ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదు. ఈ మేరకు పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారు. అమెరికాలో ఉంటున్న వారి కుమార్తెకు సమాచారం అందించారు. నాగేశ్వరరావు మెడికల్ హిస్టరీ, హత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story