విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌కు బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్‌ మంజూరు

by Kema Shiva Kumar |

2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌కు ఢిల్లీ హైకోర్టు 3 రోజుల ఇంటరిమ్ బెయిల్ మంజూరు చేసింది.

విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌కు బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్‌ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020 ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్ద ఎత్తున కుట్ర జరిగిందనే కేసులో జైల్లో ఉన్న జేఎన్‌యూ (JNU) మాజీ విద్యార్థి నేత, సామాజిక కార్యకర్త ఉమర్ ఖాలిద్‌ (Umar Khalid)కు న్యాయపరంగా భారీ ఊరట లభించింది. ఈ మేరకు ఆయనకు 3 రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. తన తల్లికి జరగనున్న సర్జరీ సమయంలో ఆమెకు తోడుగా ఉండేందుకు, అలాగే చనిపోయిన తన బాబాయ్ 40వ రోజు అంత్యక్రియల ఆచారాల్లో పాల్గొనేందుకు కోర్టు ఈ అనుమతిని ఇచ్చింది.

ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చిన హైకోర్టు..

కాగా, మే 19న ఢిల్లీలోని కర్కర్దూమా ట్రయల్ కోర్టు ఉమర్ ఖాలిద్ పెట్టుకున్న 15 రోజుల తాత్కాలిక బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఖాలిద్‌కు తండ్రి, ఐదుగురు సోదరీమణులు ఉన్నారని, తల్లి సర్జరీ కూడా చిన్నదే కాబట్టి ఆయన అవసరం లేదంటూ ప్రాసిక్యూషన్ చేసిన వాదనలతో ట్రయల్ కోర్టు ఏకీభవించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉమర్ ఖాలిద్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ప్రతిభా ఎమ్.సింగ్, జస్టిస్ మధు జైన్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. ఖాలిద్ గతంలో కూడా తన సోదరి వివాహానికి తాత్కాలిక బెయిల్‌పై బయటకు వచ్చి, కోర్టు విధించిన నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించకుండా సకాలంలో తిరిగి లొంగిపోయారని ఆయన తరఫు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ త్రిదీప్ పైస్ కోర్టుకు గుర్తుచేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు, మానవీయ కోణంలో ఆలోచించి (Empathetic View) ఖాలిద్‌కు 3 రోజుల బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఖాలిద్ రూ. 1 లక్ష వ్యక్తిగత బాండ్‌ను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అతడు కేవలం నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) పరిధిలోనే ఉండాలని, తన నివాసం, ఆసుపత్రి దాటి వెళ్లకూడదని కోర్టు తెలిపింది. అదేవిధంగా జైలు నుంచి విడుదలైన సమయంలో ఒకే ఒక మొబైల్ ఫోన్ ఉపయోగించాలని, దర్యాప్తు అధికారితో (Investigating Officer) నిరంతరం టచ్‌లో ఉండాలని హైకోర్టు ధర్మాసనం షరతులు పెట్టింది.

Next Story