మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ బ్లాస్ట్.. నిందితులకు మాఫియా లింకులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-23 05:14:38  IST  )

మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా అనూహ్యంగా అంతర్జాతీయ మాఫియా కోణం వెలుగులోకి వచ్చింది.

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ బ్లాస్ట్.. నిందితులకు మాఫియా లింకులు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన మొయినాబాద్ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ పార్టీ (Farm House Drugs Party) కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించనుంది. అయితే, సిట్ విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిందితులకు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లుగా సిట్ (SIT) అధికారులు గుర్తించడం కలకలం రేపుతోంది.

24 సార్లు డ్రగ్స్ పార్టీలు..

మొయినాబాద్‌లోని సదరు ఫాంహౌస్‌లో ఇప్పటి వరకు సుమారు 24 సార్లు డ్రగ్స్ పార్టీలు జరిగినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. కేవలం ఇక్కడే కాకుండా నగర శివార్లలోని ఇతర ఫాంహౌస్‌లలో జరిగిన పార్టీలపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. ఈ కేసులో నిందితుడైన నమిత్ శర్మ (Namit Sharma)ను పోలీసులు ప్రమాదకరమైన షార్ప్ షూటర్‌గా గుర్తించారు. అతడికి ఢిల్లీ (Delhi), పంజాబ్ (Punjab) కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.

మరోవైపు డ్రగ్స్ సరఫరా చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్‌ (Abhishek Singh)ను పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు రోహిత్ రెడ్డికి అభిషేక్ దాదాపు 24 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే, పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే డ్రగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో మాఫియా కోణం బయటపడటంతో సిట్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

Next Story