మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. కూబింగ్ ఆపరేషన్‌లో 16 మంది మావోయిస్టులు అరెస్టు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-16 09:57:19  IST  )

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. కూబింగ్ ఆపరేషన్‌లో 16 మంది మావోయిస్టులు అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్/ఆసిఫాబాద్:ఆపరేషన్ కగార్, అగ్రనేతల ఎన్‌కౌంటర్లు, సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటు మరి కొంతమంది కీలక నేతల లొంగుబాట్లు మావోయిస్టు పార్టీని బలహీనం చేస్తూనే ఉన్నాయి. అయితే, ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల కూంబింగ్‌తో మావోయిస్టులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను స్థావరంగా చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఇవాళ సిర్పూర్ (యూ) మండలంలోని అటవీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉన్న 16 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు నక్సలైట్లు తలదాచుకున్న ఇంటిని చుట్టు ముట్టి మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరిలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్‌ అలియాస్‌ బడే చొక్కారావు ఉన్నట్లు సమాచారం. అరెస్ట్ అయిన వారిలో ఏడుగురు పురుషులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. వీలో నలుగురు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన వారిని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి నుంచి ఏకే 47, రెండు ఇన్సాస్‌ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వారందరినీ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అయితే, మావోయిస్టుల పట్టివేతకు సంబంధించి జిల్లా పోలీస్ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇటీవలే ఏపీలోనూ..

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మారెడుమిల్లిలో మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగిన మరుసటి రోజున గత నెల 19న ఆక్టోపస్ పోలీసులు కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు.

Next Story