మరోసారి పంజా విసిరిన ఏసీబీ.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన నలుగురు అధికారులు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో లంచావతారులు రెచ్చిపోతున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుసగా దాడులు చేపట్టి అవినీతి అధికారుల భరతం పడుతున్నా.. అక్రమార్జనకు మాత్రం అడ్డుకట్టపడటం లేదు.

మరోసారి పంజా విసిరిన ఏసీబీ.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన నలుగురు అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో లంచావతారులు రెచ్చిపోతున్నారు. అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వరుసగా దాడులు చేపట్టి అవినీతి అధికారుల భరతం పడుతున్నా.. అక్రమార్జనకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా, రెండు వేర్వేరు ఘటనల్లో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ముగ్గురు పంచాయతీరాజ్ అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట్ ప్రాంతంలోని దేవాదాయ శాఖ భూమికి సంబంధించి సర్వే రిపోర్టు ఇచ్చేందుకు ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ (Kiran Kumar) లంచం డిమాండ్ చేశారు. బాధితుడి నుంచి మొత్తం రూ.1.50 లక్షలు డిమాండ్ చేయగా, అందులో మొదటి విడతగా రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ కుమార్ నుంచి నగదును స్వాధీనం చేసుకుని, రికార్డులను పరిశీలిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో..

ఇక రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఓ భవన నిర్మాణ అనుమతుల కోసం రూ.లక్ష లంచం డిమాండ్ చేసిన అధికారులను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో నందిగామ ఎంపీడీవో (MPDO) సుమతి, ఎంపీవో (MPO) తేజ్‌సింగ్, ఈదులపల్లి పంచాయతీ కార్యదర్శి చెన్నయ్య ఉన్నారు. భవన నిర్మాణానికి సహకరించేందుకు రూ.లక్ష తీసుకుంటుండగా అధికారులు వారిని పట్టుకున్నారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. అదేవిధంగా ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి ఫిర్యాదు చేయాలని అధికారులు వెల్లడించారు.

Next Story