అమెరికా నుంచి వచ్చి.. అనంత లోకాలకు..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-19 06:24:01  IST  )

సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉజ్వల భవిష్యత్ ఉన్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది.

అమెరికా నుంచి వచ్చి.. అనంత లోకాలకు..!
X

దిశ, హుస్నాబాద్ : సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉజ్వల భవిష్యత్ ఉన్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. హుస్నాబాద్‌ మండలం పూల్‌ నాయక్‌ తండాకు చెందిన బర్మావత్‌ మనోహర్‌ (27) ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అనంతరం అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేశాడు. మూడు నెలల క్రితమే స్వదేశానికి తిరిగి వచ్చిన మనోహర్‌, హైదరాబాద్‌లో సొంతంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఏర్పాటు చేసి నడిపిస్తున్నాడు. సంక్రాంతి పండుగ సెలవుల కోసం ఇంటికి వచ్చిన మనోహర్‌, సోమ‌వారం తన బైకుపై హుస్నాబాద్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో పట్టణ శివారులోని సబ్‌ స్టేషన్‌ సమీపంలో బైక్‌ అదుపుతప్పి తీవ్రవేగంతో పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో మనోహర్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న‌ 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ ఆయన మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమెరికా నుంచి వచ్చి, సొంతంగా కంపెనీ పెట్టి ఎదుగుతున్న యువకుడు ఇలా అకాల మరణం చెందడంతో పూల్‌ నాయక్‌ తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story