ప్రాణం తీసిన ఈత సరదా..వాటర్ ట్యాంక్ లో మునిగి వ్యక్తి మృతి..

by Disha Web Desk 20 |
ప్రాణం తీసిన ఈత సరదా..వాటర్ ట్యాంక్ లో మునిగి వ్యక్తి మృతి..
X

దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని డోడర్నాతాండ 5 గోగానాయక్ లో మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జాదవ్ సాహెబ్ రావు (28) ఈనెల 5వ తేదీ నుండి కనిపించడం లేదు. రాథోడ్ అజయ్ అనే వ్యక్తికి వాటర్ ట్యాంకు పైన సెల్ ఫోన్ మోగిన చప్పుడు వినిపించడంతో పైకి ఎక్కి చూసాడు. పైన బట్టలు, ఫోను, చెప్పులు కనిపించాయి. అనుమానంతో లోపలికి తొంగి చూడగా మృతదేహం నీళ్లలో తేలుతూ కనిపించింది.

ఈ విషయాన్ని రాథోడ్ అజయ్ గ్రామస్తులకు, మృతుని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మృతి చెందింది సాహెబ్ రావు అని నిర్ధారించుకున్నారు. మృతుడు బట్టలను, సెల్ ఫోన్ పక్కన పెట్టి ఈత కోసం లోపలికి దిగి ఊపిరాడక మృతి చెందినట్టు సమాచారం. మృతుడు సరదాగా ఈత కోసం చేసినపని ప్రాణం మీదికి తెచ్చింది. మృతునికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య సత్తుబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉండడంతో సంఘటన స్థలంలోనే భైంసా ఏరియా ఆసుపత్రి వైద్యుడు రమేష్ పోస్టుమార్టం నిర్వహించారు.

Next Story

Most Viewed