జొన్నగామలో వ్యక్తి దారుణ హత్య

by Disha Web Desk 1 |
జొన్నగామలో వ్యక్తి దారుణ హత్య
X

పోలీసుల అదుపులో నిందితులు

దిశ, ఝరాసంగం : క్షణికావేశంతో వ్యక్తిని కర్రలతో చితకబాది దారుణంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి ఝరాసంగం మండలంలోని జొన్నగామ గ్రామంలో ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జొన్నగామ గ్రామానికి చెందిన బేగరి చిన్న ఎల్లయ్య (50) అదే గ్రామానికి చెందిన ఓ మహిళపై రెండు రోజుల క్రితం అసభ్యంగా ప్రవర్తించారు.

విషయం తెలుసుకున్న ఆమె కుమారులు బుధవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న ఎల్లయ్యపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అరుపులు కేకలు రావడంతో మృతుడి అన్న నరసయ్య, ఆయన కుమారులు ప్రభు, తమ్ముడు నాగయ్య చూసేసరికి ఎల్లయ్య రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో హుటాహుటిన 108 వాహనంలో బుధవారం అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఎల్లయ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

విషయం తెలుసుకున్న రూరల్ సీఐ వెంకటేశం, ఏఎస్ఐ కృష్ణ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతుడి తమ్ముడు నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ డీఎస్పీ రఘు, సీఐ వెంకటేశం తెలిపారు. ఎప్పుడు లేని విధంగా గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురికావడంతో గ్రామస్థులు భయభ్రాంతులకు లోనవుతున్నారు.


Next Story

Most Viewed