తలకొండపల్లిలో పిడుగు పాటుకు 5 ఆవులు మృతి..

by Disha Web Desk 20 |
తలకొండపల్లిలో పిడుగు పాటుకు 5 ఆవులు మృతి..
X

దిశ, తలకొండపల్లి : మండలంలో మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈదురు గాలులు, ఉరుముమెరుపులతో కూడిన భారీ వర్షం రెండు గంటల పాటు కురిసింది. కాగా వెల్జాల్ గ్రామంలో నీరటి స్వామి రెండు పాడి పశువులు, సంగాయిపల్లి గ్రామంలో ధ్యాప తిరుపతిరెడ్డి ఒక పాడిపశువు, చౌదర్పల్లిలో దొడ్డు యాదయ్యకు ఒక్క ఆవు, బలుసులపల్లిలో కేత్లావత్ కిషన్ ఒక్క ఆవు పిడుగుపాటుకు గురై మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వెల్జాల్ గ్రామ సమీపంలో హఫీజోద్దీన్ అనే రైతుకు చెందిన వ్యవసాయ పొలాన్ని లీజుకు తీసుకొని అదే గ్రామానికి చెందిన నీరటి స్వామి అనే రైతు రెండు ఆవులను సాదుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు.

మంగళవారం రాత్రి తన వ్యవసాయ క్షేత్రంలో రోజువారీగా వేపచెట్టు కింద రెండు పాడి ఆవులను కట్టివేసి ఇంటికి వచ్చిన రైతు నీరటి స్వామికి తెల్లారేసరికి పొలం వద్దకు వెళ్లి చూడగా రెండు పాలిచ్చే ఆవులు పిడుగుపాటుకు గురై మృత్యువుడికి చేరడంతో ఆ రైతు రోదనలు పలువురిని కంటతడికి గురిచేసాయి. పిడుగు రూపంలో రెండు ఆవులు కోల్పోవడంతో సుమారు లక్ష అరవై వేల రూపాయల నష్టం జరిగిందని రైతు కన్నీరు మునీరుతో వినిపిస్తున్నాడు. అదేవిధంగా సంగాయిపళ్లి గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి పాడిపశువు చింత చెట్టు కింద కట్టివేసి ఉండడంతో పిడుగుపాటుకు గురై మృతి చెందింది. చౌదర్పల్లి గ్రామంలో దుడ్డు యాదయ్యకు చెందిన పశువు కూడా మృతి చెందింది. బలుసులపల్లిలో కేతులావత్ కిషన్ కు చెందిన ఒక పాడిపశువు మృతి చెందాయి.

ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే ప్రమాదాలను ప్రభుత్వం గుర్తించి ఇలాంటి రైతులను వెంటనే ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించవలసిన బాధ్యత నేటి ప్రభుత్వాలపై ఉందని గ్రామస్తులు, మండల ప్రజలు మొత్తం ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. వెల్జాల్ లో పిడుగుపాటు గురై రెండు పాడి పశువులు మృతి చెందిన విషయం తెలుసుకున్న తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ నీరటి స్వామిని పరామర్శించి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే తలకొండపల్లి మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ బాధిత రైతు స్వామి పరామర్శించి మూడు వేల ఆర్థిక సాయం అందించారు. వెల్జాల్ ఎంపీటీసి అంబాజీ, ఉపసర్పంచ్ అజీజ్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కేశవరెడ్డి లు బాధిత రైతును పరామర్శించి, ఓదార్చి ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందే విధంగా కృషి చేస్తామన్నారు. గత దశాబ్ద కాలం నుండి ఇలాంటి పిడుగులు మెరుపులను ఎన్నడూ కూడా చూడలేదని బాధితులు పేర్కొంటున్నారు.



Next Story

Most Viewed