కొత్త క్రికెట్ ఫార్మాట్ కనిపెట్టిన దక్షిణాఫ్రికా

by  |
కొత్త క్రికెట్ ఫార్మాట్ కనిపెట్టిన దక్షిణాఫ్రికా
X

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా క్రికెట్ స్తంభించిపోయింది. ఇప్పటికిప్పుడు ఆట ప్రారంభమైనా స్టేడియాలకు ప్రేక్షకులు వస్తారో రారో అనే అనుమానం నెలకొంది. అందుకోసం క్రికెట్ సౌతాఫ్రికా వినూత్నంగా ఆలోచించింది. క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్‌ను రూపొందించింది.

3టీ క్రికెట్ పేరుతో పిలిచే ఈ ఆటలో మూడు జట్లు కలిసి ఒకే మ్యాచ్ ఆడటం విశేషం. ఈ నెల 27న సెంచూరియన్ పార్క్‌లో సాలిడరీ కప్ పేరుతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ నిర్వహించనుంది. దక్షిణాఫ్రికాకు చెందిన 24 మంది క్రికెటర్లు ఈ సాలడరీ కప్‌లో ఆడనున్నారు. మూడు జట్లుగా వీరిని విభజించారు. ది ఈగల్స్ జట్టుకు ఏబీ డివిలియర్స్, కింగ్ ఫిషర్స్ జట్టుకు కగీసో రబాడా, ది కైట్స్ జట్టుకు క్వింటన్ డీకాక్ నాయకత్వం వహించనున్నారు.

ఈ మ్యాచ్ 36 ఓవర్ల పాటు సాగనుంది. కాగా, 18 ఓవర్ల తర్వాత బ్రేక్ ఇస్తారు. ప్రతి జట్టూ 12 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తుంది. దాన్ని ఆరు ఓవర్లకు ఒక భాగంగా విభజించారు. ప్రతి ఆరు ఓవర్లను వేర్వేరు జట్లు బౌలింగ్ చేస్తాయి. మొదట ఎవరు బ్యాటింగ్, బౌలింగ్ చేయాలనేది డ్రా ద్వారా నిర్ణయిస్తారు. తొలి ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్, బౌలింగ్ రోటేషన్ పద్ధతిలో సాగుతుంది. కానీ రెండో హాఫ్‌లో మాత్రం తొలి అర్థ భాగంలో అత్యధిక స్కోర్ చేసిన జట్టే తొలిసారి బ్యాటింగ్ చేస్తుంది.

ఇక ప్రతి జట్టులోనూ 8 మంది ఆటగాళ్లు ఉంటారు. ఏడు వికెట్లు పడిపోయిన తర్వాత చివరి బ్యాట్స్‌మాన్ సింగిల్‌గా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ, కేవలం సరి సంఖ్య పరుగులు మాత్రమే కొట్టాలి. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. వారికి గోల్డ్ మెడల్, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు సిల్వర్, మూడో జట్టుకు కాంస్యం పతకాలు బహుకరిస్తారు. ఈ మ్యాచ్‌ను సూపర్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.



Next Story

Most Viewed