రేసుగుర్రాలకు అవకాశం.. టీ20 కోసం ఎదురుచూపులు..!

by  |
రేసుగుర్రాలకు అవకాశం.. టీ20 కోసం ఎదురుచూపులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవాలీ క్రికెట్‌లో ఆ నలుగురు ఆటగాళ్లు రేసుగుర్రాలుగా పేరుతెచ్చుకున్నారు. బరిలోకి దిగితే బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించడమే పనిగా పెట్టుకున్నారేమో.. ఒకరు బ్యాట్‌తో బీభత్సం సృష్టిస్తే.. మరొకరు పదునైన బంతులను సంధిస్తూ ప్రత్యర్థులకు వణుకుపుట్టించారు. ఏ జట్టు నుంచి ఆడినా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర వహించారు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటుతూ.. ఎట్టకేలకు తమ జీవిత లక్ష్యాన్ని సాధించారు. డొమెస్టిక్‌ క్రికెట్‌లో ప్రభంజనం సృష్టిస్తున్న వీరు.. భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించారు. ఇంతకీ వారు ఎవరో తెలియాలంటే, రీడ్ దిస్ స్టోరీ.

ఇంతకీ ఎవరువాళ్లు..?

వారెవరో కాదు.. అనతి కాలంలోనే భారత క్రికెట్ అభిమానులను అమితంగా ఆకర్షించిన ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తి. ఒకేసారి ఈ నలుగురు ఆటగాళ్లు అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేయబోతున్నారు. అదీ వరల్డ్ కప్‌ డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడబోతున్నారు. వీరి అరంగేట్రంతో ప్రత్యర్థి జట్టు పెను సవాల్ ‌ఎదుర్కొవాల్సిందే అంటూ భారత అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్‌పై ఇండియా డ్రీమ్ టీమ్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ.. ఈ నలుగురు ఆటగాళ్లను మెన్షన్ చేస్తున్నారు.

అవకాశం వచ్చిందిలా..

ఇంగ్లాండ్‌ టూర్‌ ఆఫ్ ఇండియాలో భాగంగా ప్రస్తుతం టీమిండియాతో రూట్ సేన నాలుగు టెస్టు సిరీస్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ మ్యాచ్‌లు మార్చి 8న ముగియనున్నాయి. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం మార్చి 12 నుంచి 20 వరకు టీ20 మ్యాచులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20వ తేదీన భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో నలుగురు యువఆటగాళ్లకు (ఇషాన్, సూర్య కుమార్ యాదవ్, రాహుల్, వరుణ్‌) మొదటిసారిగా అవకాశం(అరంగేట్రం) కల్పించింది. ఈ ప్రకటన వెలువడిన మరు క్షణం నుంచే సోషల్ మీడియాలో భారత టీ20 స్క్వాడ్‌ వైరల్‌గా మారింది.

బలానికే బలం వచ్చింది..!

ఇప్పటికే జట్టులో పరుగుల రారాజు విరాట్ కోహ్లీ, హార్డ్ హిట్టర్ రోహిత్ శర్మ, డ్యాషింగ్ ఓపెనర్ గబ్బర్(శిఖర్ ధావన్), క్లాసిక్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ ఉండగా.. వీరికితోడు డేంజరస్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇంతటి బలమైన జట్టుకు ఈ నలుగురు ఆటగాళ్లు కూడా జతకావడం అద్భుతమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, 11 మందితో కూడిన జట్టులో ఏ ఆటగాడు ఉంటాడనేది తెలియాలంటే మార్చి 12 వరకు ఎదురుచూడాల్సిందే.


Next Story