స్టేడియంలో అనుచిత ప్రవర్తన.. ఫ్యాన్స్ గెంటివేత

by  |
స్టేడియంలో అనుచిత ప్రవర్తన.. ఫ్యాన్స్ గెంటివేత
X

దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో ఫ్యాన్స్ అనుచిత ప్రవర్తనతో క్రికెటర్లను ఇబ్బంది పెట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్టేడియంలోని స్టాండ్ ‘ఎం’ బ్లాక్‌లో కూర్చున్న ఇద్దరు క్రికెట్ ఫ్యాన్స్ న్యూజీలాండ్ క్రికెటర్ రాస్ టేలర్‌పై అనుచిత, జాత్యహంకార వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. స్టేడియంను ఆనుకొని క్రికెటర్ల బస చేస్తున్న హోటల్ ఉన్నది. దాని కిందనే ఉన్న ఎం బ్లాక్‌లో కూర్చున్న ఇద్దరు ప్రేక్షకులు ఇష్టానుసారంగా మాట్లాడుతుండటం గమనించిన కొంత మంది ఐసీసీకి సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు.

వెంటనే అప్రమత్తమైన ఐసీసీ తమ సిబ్బందిని అక్కడకు పంపించి వారిద్దరినీ స్టేడియం నుంచి గెంటేశారు. ‘రోజ్ బౌల్ స్టేడియంలో ఇద్దరు వ్యక్తులు ఆటగాళ్లను దూషించినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని క్రికెట్ స్టేడియం నుంచి గెంటేశారు. వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేస్తే మాత్రం అస్సలు ఉపేక్షించం’ అని ఐసీసీ స్పష్టం చేసింది. అయితే 5వ రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన టిమ్ సౌథీ మాత్రం ఈ విషయం గురించి తెలియదని వ్యాఖ్యానించాడు.

Next Story

Most Viewed