అర్దరాత్రి పాతబస్తీలో భారీ బ్లాస్ట్..

by  |
అర్దరాత్రి పాతబస్తీలో భారీ బ్లాస్ట్..
X

దిశ, చార్మినార్ : దీపావళి పండుగ రోజున పాతబస్తీలో కందికల్ గేట్ దగ్గర విషాదం చోటుచేసుకుంది. పీఓపీ వర్క్ యూనిట్ ఓపెన్ స్థలంలో జరిగిన పేలుళ్లలో వెస్ట్ బెంగాల్ కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందగా, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మరో యువకుడు తీవ్ర గాయాలపాలై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉల్లాస్ అనే వ్యక్తి గత కొంత కాలంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ బొమ్మలు తయారు చేసే యూనిట్ ను నడుపుతున్నాడు. వెస్ట్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ లకు చెందిన కార్మికులతో పనులు చేయిస్తున్నాడు. దీపావళి పూజ అనంతరం కొన్ని టపాసులను ఆ యూనిట్ లో పనిచేసే వెస్ట్ బెంగాల్ కు చెందిన విష్ణు (25), జగన్ (30), ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీరెన్ (25) కార్మికులకు ఇచ్చి వెళ్ళిపోయాడు. రాత్రి 11గంటల 5 నిమిషాల తర్వాత ఒక్క సారిగా పేలుడు జరిగింది. ఈ పేలుడు లో విష్ణు, జగన్ లు అక్కడి కక్కడే మృతి చెందగా, బీరెన్ తీవ్ర గాయాల పాలయ్యాడు. పెద్ద శబ్దానికి ఉలిక్కి పడ్డ స్థానికులు చత్రినాక పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న ఫలక్ నామా ఏసీపీ మాజిద్, చార్మినార్ ఏసీపీ భిక్షం రెడ్డి, ఛత్రినాక ఇన్ స్పెక్టర్ ఖాదర్ జిలాని, ఫలక్ నుమా ఇన్ స్పెక్టర్ దేవేందర్ లు పరిస్థితి ని సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన బీరెన్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఘటన స్థలంలో మృతి చెందిన విష్ణు, జగన్ మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఒక ఫీట్ లోతులో గొయ్యి ఏర్పడ్డది. ఆ గొయ్యికి కాస్త దూరంలో రక్తపు మడుగులో మృత దేహాలు చెల్లా చెదురుగా పడిఉన్నాయి. ఆ పీఓపీ యూనిట్ లో నాలుగు చిన్న రేకుల రూమ్ ల తో పాటు అనునిత్యం పనులు చేసుకునే రేకుల షెడ్ ఉంది. ఆ యూనిట్ లో దాదాపు నాలుగు సి.సి కెమెరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టపాసులు పేలడంతో జరిగిన ఘటనలా కనిపించడం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఒక వేళ బాంబు పేలుళ్లయితే చుట్టుపక్కల నిర్మాణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని, ఇది బాంబు పేలుడు అని కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కెమికల్స్ ను ఉపయోగించి బాణా సంచాలు పేల్చి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహాల ముఖం పైన గాయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భూమిలో కెమికల్స్ పాతిపెట్టి ఏదైనా విస్ఫోటనానికి ప్రయోగాలు చేశారా ? అనే కోణాల్లోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ పేలుళ్లలో మృతి చెందిన విష్ణు గురువారం వెస్ట్ బెంగాల్ కు వెళ్తున్నానని చెప్పి స్టేషన్ కు వెళ్ళాడు. అక్కడ రైలు మిస్ కావడంతో తిరిగి యూనిట్ కు చేరుకుని పేలుళ్ల ఘటనలో మృతి చెందినట్లు సమాచారం. యూనిట్ లో ఉన్న సిసి కెమెరాలను ఛత్రినాక పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసు నమోదు చేసిన ఛత్రినాక పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Next Story

Most Viewed