కేంద్ర ప్రభుత్వం ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తోంది : సీపీఐ రామకృష్ణ

by  |
cpi
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీపై సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్రమోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతోందని ధ్వజమెత్తారు. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద వర్గాలు, మధ్య తరగతి వర్గాలు ఉపాధి కోల్పోతే.. పెట్టుబడి దారుల ఆస్తులు మాత్రం విపరీతంగా పెరిగాయని చెప్పుకొచ్చారు. అంబానీ, ఆదానిల ఆస్తులు రెట్టింపు అయ్యాయన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల ఆప్తుడు ఆదాని ఆస్తులు ఒక్కసారిగా 400 శాతం రెట్టింపు అయ్యాయని ఆరోపించారు.

అంతేకాకుండా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని అందులో భాగమే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను కాపాడేందుకు సీపీఐ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకోవడానికి సీపీఐ పోరాటాలకు సిద్ధం అవుతున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. ఈ నెల 14 నుంచి అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసేందుకు సీపీఐ సిద్ధం అయ్యిందని తెలిపారు.

మోడీ అంటే వైసీపీ ఎంపీలకు భయం
ప్రధాని మోడీని చూస్తే వైసీపీ ఎంపీలు భయపడిపోతున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కేంద్రం అడుగుజాడల్లో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర సంస్కరణలు అమలు చేస్తున్న వాటిలో మధ్యప్రదేశ్, ఏపీ ప్రభుత్వాలు ముందు వరుసలో ఉన్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ మెడలు వంచేందుకు సీపీఐ పాదయాత్ర చేపడుతోందని హెచ్చరించారు. మరోవైపు వినాయక చవితి విషయంలో బీజేపీ లేవనెత్తిన అంశాలకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల సంబరాలకు జయంతులు, వర్ధంతులకు కరోనా నిబంధనలు వర్తించవా అని నిలదీశారు. కరోనా నిబంధనలు అందరికి వర్తించాలని సూచించారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పక్ష పాత ధోరణిని అవలంబిస్తోందని మండిపడ్డారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ శాంతి భద్రతల పర్యవేక్షణ విషయంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ను రద్దు చేసి మీటర్లు బిగించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అది బయటకు రానీయకుండా సీఎం జగన్ రైతులను మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు.

కృష్ణా జలాల విషయంలో కేసీఆర్‌ది పూటకోమాట
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకతాటిపైకి వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని హితవు పలికారు. నీటి విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయలేదన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జలవివాదాలపై సీఎం కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. నీటి విషయంలో రోజుకొక మాట మాట్లాడటం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తగదని హితవు పలికారు. కేఆర్ఎంబీ చెప్పినట్లుగానే ఇరు రాష్ట్రాలు నడుచుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ సూచించారు.

Next Story

Most Viewed