దళితున్ని పూజారిగా పెట్టండి.. సీపీఎం సంచలన డిమాండ్

by  |
దళితున్ని పూజారిగా పెట్టండి.. సీపీఎం సంచలన డిమాండ్
X

దిశ, దుబ్బాక : దళితుల మీద కపట ప్రేమ చూపిస్తున్నారని కమ్యూనిస్టులను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించడం, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ విమర్శించారు. సోమవారం దుబ్బాక పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు పాలన కేరళ రాష్ట్రంలో ఒక దళితుడిని దేవాలయంలో పూజారిగా నియమించి, దేవాదాయ శాఖకు దళితుడిని మంత్రిని చేసిన ఘనత సీపీఎం పార్టీకి ఉన్నదని గుర్తు చేశారు. ఎమ్మెల్యేకు దళితుల మీద ప్రేమ ఉంటే దుబ్బాక‌లో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర్ల దేవాలయంలో ఒక దళితుడిని పూజారిని పెట్టి చూపిండన్నారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అనేక చోట్ల దళితులను అవమానపరిచి హత్యలు, చేసిన దుర్మార్గమైన చర్యలు ఎన్నో ఉన్నాయన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని రద్దు చేసి దళితులను మోసం చేయాలని కుట్రలు చేసింది బీజేపీ కాదా అన్నారు. రాష్ట్రంలో దళితులపై గిరిజనులపై కుల దురహంకార హత్యలు, కులాంతర వివాహాలపై హత్యలు, అత్యాచారాలు వంటి అనేక ఘటనలు జరిగినప్పుడు రఘునందన్ రావు గారు ఎందుకు స్పందించలేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కమ్యూనిస్టులను విమర్శించే విధానాన్ని మానుకోవాలని లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు ఎండీ సాదీక్, ప్రశాంత్, నాయకులు తడ్క లచ్చయ్య, భాస్కర్, దినేష్, మల్లేశం, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed