అతను ఆర్థిక మంత్రి కాదు అప్పుల మంత్రి : సీపీఐ నేత రామకృష్ణ

by  |
ramakrisna
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రమంత్రులపై సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ మండిపడ్డారు. రాజధానిపై పిచ్చిపట్టినట్టు మంత్రులు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులతో మాట్లాడటం అనవసరమని ఓ మంత్రి.. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని మరో మంత్రి వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. మంత్రి పదవుల కోసం ఇంతలా దిగజారిపోయి మాట్లాడాలా? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అనడం అర్థంలేని వ్యాఖ్యలన్నారు. సీఎం సిమ్లాకు పోతే ఏపీ రాజధాని సిమ్లా అయిపోతుందా? అని నిలదీశారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా తయారైందన్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థికమంత్రి కాదని అప్పుల మంత్రని ప్రజలు చెప్పుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే ఆదాయానికి సహకరించకపోవడం వల్లే కలెక్టర్ గంధం చంద్రుడిని బదిలీ చేశారని రామకృష్ణ ఆరోపించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను చూసి జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని దుయ్యబట్టారు. రైల్వేలు, రోడ్లు, పోర్టులు, పరిశ్రమలు ఇలా అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20న అన్ని పార్టీలతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే ఈనెల 25న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌ బంద్ నిర్వహిస్తున్నట్లు కే రామకృష్ణ వెల్లడించారు.

Next Story