సీఎం కేసీఆర్‌పై సీపీఐ నారాయణ ఫైర్

by  |
CPI-Narayana
X

దిశ, మునుగోడు: తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం నల్గొండ సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం కూతురు వివాహానికి వెళ్తూ నారాయణపురం మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే దురుద్దేశంతో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో పేదల భూములను గుంజుకొని పెద్దలకు కట్టబెట్టేందుకు వేలం వేస్తున్నారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా భూమిని నమ్ముకొని సాగు చేసుకుంటున్న రైతులను రోడ్డుపాలు చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు.

సీపీఐ బలోపేతం కోసం యువతను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, మండలంలోని నిరుపేద ప్రజల భూములను ప్రభుత్వం తీసుకునేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. రాచకొండలోని గిరిజనులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని నిరుపేదలైన కుటుంబాలు ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములకు పట్టాల పంపిణీలో జాప్యం ఎందుకు చేస్తున్నారని నారాయణ ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు భూములపై కన్నేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నారాయణపురం మండల కార్యదర్శి బచ్చనగోని గాలయ్య, చౌటుప్పల్ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, మండల నాయకులు దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, పల్లె మల్లారెడ్డి, వీరమళ్ళ యాదయ్య, విద్యార్ధి నేత వెంకటేష్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed