కమాండ్ కంట్రోల్ టూ ట్యాబ్

by  |
కమాండ్ కంట్రోల్ టూ ట్యాబ్
X

దిశ, కరీంనగర్: కనుచూపు మేరలో పోలీసులు కనిపించట్లేదు మన గల్లీలో మనం ముచ్చట్లు పెట్టుకుంటే ఏమవుతుంది అన్న ధీమాతో ఉండే వారు కళ్లు మూసి తెరిచే సరికి పోలీసులు ప్రత్యక్ష్యం అవుతున్నారు. డ్రోన్ కెమెరాల్లో రికార్డవుతోందని తెలిసిన కొందరు.. పెట్రోలింగ్ పార్టీలు తమ వద్దకు వచ్చేవరకూ ఉంటామా ఏంటి అన్న ధైర్యంతో గుంపులుగా చేరి ముచ్చట్టు పెట్టుకుంటున్నా, వారి కళ్లు బైర్లు కమ్మేలా వ్యవహరిస్తున్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి. కమలాసన్ రెడ్డి. గస్తీ తిరిగే పోలీసులు, బందోబస్తు చేసే టీంలకు సంబంధం లేకుండా ఆయన ఆపరేషన్ ‘కరోనా’ స్టార్ట్ చేశారు.కరీంనగర్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగానే అప్రమత్తం అయింది పోలీసు యంత్రాంగం. ఒకరి నుండి మరొకరికి ఈ వ్యాధి ప్రబలితే ప్రమాదమని భావించిన అధికారులు చకచకా చెక్ పెట్టేస్తున్నారు గుంపులుగా జట్టు కడుతున్నవారిపై. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత నగరంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి ఏకంగా కమాండ్ కంట్రోల్ వాహానాన్ని కరీంనగర్‌కు తెప్పించారు. ఈ వాహనాల ద్వారా డ్రోన్ కెమరాలను ఉపయోగించి ఆయా ప్రాంతాల్లోని పోలీసులను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది. అయితే కరీంనగర్ సీపీ ఓ అడుగు ముందుకేసి కమాండ్ కంట్రోల్ వాహనం ఆపరేటింగ్ సిస్టంను తనవద్ద ఉన్న ట్యాబ్‌కు అనుసంధానం చేసుకున్నారు. దీంతో నగరంలోని మెయిన్‌రోడ్డు మొదలు గల్లీ వరకు అన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతుంతో అప్‌డేట్ అవుతున్నారు.

నగరంలో కొన్ని ప్రాంతాల్లో కార్డన్‌ ఆప్ కూడా చేయడంతో ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రాకుండా… వచ్చినా గుంపులు గుంపులు ఉంటే చెదరగొట్టేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో పెట్రోలింగ్ పార్టీలు సంచరిస్తున్నా కూడా స్పెషల్ టీంలను ఏర్పాటు చేయించారు. డ్రోన్ కెమెరాలో గుంపులు కనిపించగానే స్పెషల్ టీంలను రంగంలోకి దింపి చెదరగొట్టాలని ఆదేశిస్తున్నారు. నగరం నలుమూలల ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంతో అప్‌డేట్ అవుతూ లాక్‌డౌన్ తీరుతెన్నులను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం టైంలో నిత్యవసరాలు కొనుగోలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా లేదా అన్న విషయం తెలుసుకునేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

వాలంటీర్ల సేవలు

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బాధ్యతలన్నీ పోలీసులకు అప్పగిస్తే అదనపు భారం పడుతుంతుందని గమనించిన సీపీ వాలంటీర్ విధానాన్ని అమలు చేశారు. కరీంనగర్‌లో దాదాపు 200 మందికి పైగా యువతను వాలంటీర్లుగా ఎంపిక చేసి ఉదయం నిత్యవసరాలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై డ్రోన్ కెమెరా ద్వారా మూడో కన్ను వేసి ఆ ప్రాంత వాలంటీర్లకు సూచలను పంపిస్తున్నారు. వెంటనే వాలంటీర్లు సోషల్ డిస్టెన్స్ పాటించని దుకాణం వద్దకు వెల్లి ప్రజలను క్రమ పద్దతిలో పంపిస్తున్నారు. రోజుకు రెండు నుండి మూడు గంటల పాటు వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటున్న పోలీసులు వారికి బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నారు.

బయటి ఫుడ్ నో

లాక్‌డౌన్‌ నేపథ్యంలో డ్యూటీ చేస్తున్న పోలీసులు స్వచ్ఛంద సంస్థలు అందించే ఆహారం, పానీయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విధులకు హాజరయ్యే పోలీసులు ఇంటి నుండే ఆహారం, బట్టర్ మిల్క్ వంటివి తీసుకుని రావాలని సూచించారు. దీంతో పోలీసులు చాలా మంది తమ ఇళ్ల నుండే అన్నపానీయాలు తీసుకుని వచ్చి డ్యూటీలు చేస్తున్నారు.

Next Story

Most Viewed