పట్టుబడితే ప్రభుత్వం ఉద్యోగం నై .. మందుబాబులకు హెచ్చరిక

by  |
పట్టుబడితే ప్రభుత్వం ఉద్యోగం నై .. మందుబాబులకు హెచ్చరిక
X

దిశ, క్రైమ్ బ్యూరో : రోడ్డు భద్రత నియమాలను వాహనాదారులు కచ్చితంగా అమలు చేసేలా హైదరాబాద్ పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అమలులో భాగంగా ఇప్పటి వరకూ హెల్మెట్ పెట్టుకోకుంటే కేసులు నమోదు చేయడం, రోడ్డు ప్రమాదాలకు కారకులైన వాహనదారులపై 304 పార్ట్ -2 కింద హత్యానేరం కింద జైలుకు పంపుతున్నారు. ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసి ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనున్నారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా చేయడమే కాకుండా, విదేశాలకు వెళ్లేందుకు తప్పనిసరిగా కావాల్సిన పాస్ పోర్టు, వీసా పొందడంలో ఇబ్బందులు తప్పవంటూ నగర సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు.

హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో మార్చి-2021 నెలలో పట్టుబడిన డ్రంకెన్ డ్రైవ్ కేసుల వివరాలను సీపీ అంజనీకుమార్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021 మార్చి నెలలో 2049 మంది డ్రంకెన్ డ్రైవ్ కేసులను నమోదు చేశామన్నారు. వీరందరికీ గోషామహాల్, బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం పట్టుబడిన 2049 మందిలో 1917 మందిపై నాంపల్లి 3వ, 4వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులలో చార్జిషీటు దాఖలు చేసి హాజరుపర్చారు.

కోర్టులో హాజరుపర్చిన 1917 మందిలో 58 మందికి కోర్టులు జైలు శిక్ష విధించాయి. వీరిలో ముగ్గురు వ్యక్తులకు 9 రోజులు, 10 మందికి 7 రోజులు, 25 మందికి 5 రోజులు, 20 మందికి రెండ్రోజులు, మరో 14 మందికి కోర్టు పూర్తయ్యే వరకూ నిలబడాలని కోర్టులు తీర్పునిచ్చాయి. రహదారిపై ప్రయాణించే వారి భద్రత కోసం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా డ్రంకెన్ డ్రైవ్ చేసే వారిపై నిరంతరం డ్రైవ్ చేస్తున్నట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. వాహనదారులు అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Next Story

Most Viewed